వెనకడుగు వేసేది లేదు..ఇద్దరూ ఇద్దరే: కేసీఆర్ జగన్ మధ్య వాటర్ వార్..వాట్ నెక్ట్స్..?
అమరావతి: ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల మధ్య మైత్రికి గండిపడుతోందా..? రెండు రాష్ట్రా మధ్య వాటర్ వార్ ఇద్దిరి సీఎంలకు ప్రతిష్టాత్మకంగా మారింది. 2019 ఎన్నికల నుంచి నిన్న మొన్నటి దాకా ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా వ్యవహరించిన ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్య ఇప్పుడు పోతిరెడ్డిపాడు వివాదం తారాస్థాయికి చేరింది. ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో ఈ వివాదానికి కారణమైంది.
Recommended Video
ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైలం నుంచి నీటి తరలింపు నిర్ణయం ఈ కొత్త వివాదానికి కారణం. ఇద్దరు ముఖ్యమంత్రులు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. కృష్ణాబోర్డుకు వెళ్లాలని ఇద్దరూ నిర్ణయించారు. దీంతో జగన్ కేసీఆర్ల మధ్య కొత్త గ్యాప్కు కారణం అవుతుందా..? ఎటువైపునకు దారి తీస్తుంది..? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం చేయబోతున్నారు..? ఇద్దరిలో ఏ ఒక్కరూ తగ్గే రకం కాకపోవడంతో ఆ ఇద్దరి అడుగులు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తికరంగా మారాయి.
జగన్ కోరిందే ప్రధాని చేశారా..? ఏపీకి కొత్త ఊరట..మారుతున్న రాజకీయ సమీకరణాలు
అపూర్వ మైత్రికి గండి
ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పొరుగు రాష్ట్రం తెలంగాణలో ప్రత్యేకించి కేసీఆర్తో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. రెండు రాష్ట్రాల మధ్య ఇచ్చి పుచ్చికునే ధోరణితో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఒక దశలో కేంద్ర ప్రభుత్వం బోర్డులు, పంచాయితీలు అవసరం లేకుండా వారిద్దరూ సమస్యలన్నీ పరిష్కరించుకునేందుకు ముందుకు కదిలారు. అటు ప్రగతి భవన్లో ఇటు తాడేపల్లిలో సుదీర్ఘ సమావేశాలు జరిగాయి. తెలంగాణ నుంచి రాయలసీమ వరకు నదులు అనుసంధానం అవసరమైన చోట్ల ఎత్తిపోతలతో రెండు రాష్ట్రాల రైతులకు మేలు చేస్తామని ప్రకటించారు. కానీ తర్వాత పరిణామాల్లో మార్పులు వచ్చాయి.
కేసీఆర్తో జరిగిన చర్చలతో సంబంధం లేకుండానే జగన్ కొత్త ప్రతిపాదనలను తెరమీదకు తెచ్చారు. దాంతో వారిద్దరి మధ్య అగాధం ఏర్పడిందని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అది వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని బలోపేతం చేసింది. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఒక జీవో కొత్త వివాదానికి కారణమైంది.
కేసీఆర్ జగన్ ఎవరి వాదన వారిదే..
తాజాగా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపుపైన తీసుకున్న నిర్ణయం కేసీఆర్ ఆగ్రహానికి కారణమైంది. ఆయన ఈ నిర్ణయం పైన అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశారు. అవసరమైతే సుప్రీంకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్ సైతం స్పందించారు. ఏపీ వాటాలో వచ్చే నీటిని మాత్రమే తాము వాడుకోవడంలో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.
కృష్ణా నదిలో 881 అడుగుల నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డి పాడు నుంచి నీటి సరఫరా సాధ్యం అవుతుందని అది ఏడాదిలో 10 రోజులు మాత్రమే అలా ఉండే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ఆ 10 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు ప్రకాశం జిల్లాలకు నీరు వెళ్లాల్సి ఉంటుందనేది జగన్ వాదన. దీనిపైన ప్రస్తుతం పంచాయతీ కొనసాగుతోంది. ఇద్దరి సీఎంల మద్దతుగా ఆ రాష్ట్రాల జల ఇంజినీర్లు బలమైన వాయిస్ను వినిపిస్తున్నారు.
ఇద్దరూ తగ్గరు... రణం తప్పదా
ఉమ్మడి ప్రాజెక్టు వ్యవహారంలో మొదలైన వివాదం ఇద్దరి ముఖ్యమంత్రులకు సమస్యగా మారుతోంది. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో టార్గెట్ చేస్తున్నాయి. ఏపీలో బీజేపీ నేతలు జగన్ వాదనకు మద్దతు ఇస్తున్నారు. టీడీపీ మాత్రం ఇంకా అధికారికంగా స్పందించలేదు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో కేసీఆర్, ఏపీ ప్రయోజనాల విషయంలో జగన్ ఏ మాత్రం వెనకడుగు వేసే వ్యక్తులు కాదు. ఇద్దరూ ఇద్దరే.
ఇద్దరిలో ఎవరు వెనకడుగు వేసినా రాజకీయంగా ప్రత్యర్థులకు టార్గెట్ అవుతారు. అందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు సిద్ధంగా లేరు. దీంతో నేరుగా ఇద్దరు సీఎంలు ఈ విషయంపై చర్చించుకుని పరిష్కారంకు ముందుకు వస్తారని ఏపీలోని వైసీపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. కేసీఆర్ జగన్ల మధ్య దూరం పెరగాలని కోరుకుంటున్న రాజకీయ ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వకూడదన్నది వారి ఉద్దేశం. మరి ఈ విషయాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు ఏ రకంగా పరిష్కరించుకుంటారు ఇది ముదిరితే ఏ స్థాయి వరకు వెళుతుందనేది రాజకీయ పార్టీలతో పాటుగా రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తికరంగా గమనిస్తున్నారు. ఈ వ్యవహారంతో ఈ రోజు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.