ప్రత్యేక హోదాపై బాబు యూటర్న్, ఎన్డీఏలోనే ఉంటూ టిడిపి మైండ్ గేమ్: బిజెపి
అమరావతి: రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎలాంటి సహయం చేయలేదని ప్రచారం చేయడం దారుణమని విశాఖ ఎంపీ, బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు చెప్పారు. ఏపీ రాష్ట్రానికి విభజన చట్టంలో లేని అంశాలను కూడ అమలు చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు.
బిజెపి కోర్కమిటీ సమావేశం ఆదివారం నాడు విజయవాడలో జరిగింది. విశాఖ ఎంపీ, బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.ఏపీ ప్రభుత్వం నుండి బిజెపి మంత్రులు వైదొలగడం, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై బిజెపి నేతలు చర్చించారు.
రాష్ట్రానికి వచ్చిన నిధులను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై టిడిపి సహ ఇతర పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని నిర్ణయం తీసుకొన్నారు.సమావేశ వివరాలను విశాఖ ఎంపీ హరిబాబు ఆదివారం నాడు మీడియాకు వివరించారు.
రాజకీయం కోసమే బిజెపిపై తప్పుడు ప్రచారం
ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుండి పూర్తి స్థాయిలో నిధులను విడుదల చేస్తున్నా, అన్ని రకాలుగా సహయ సహకారాలు అందిస్తున్నా, ఉద్దేశ్యపూర్వకంగా బిజెపిని లక్ష్యంగా చేసుకొని బిజెపిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బిజెపి ఎంపీ హరిబాబు చెప్పారు.విభజనన చట్టంలో లేని అంశాలను కూడ ఏపీ రాష్ట్రానికి అందించినట్టుగా హరిబాబు గుర్తు చేశారు.ఏపీకి బిజెపి మోసం చేసిందని ప్రచారం చేయడం బాధాకరమని హరిబాబు చెప్పారు.
సమైఖ్య రాష్ట్రంలో ఏపీ నష్టపోయింది
సమైఖ్య రాష్ట్రంలో ఆంధ్రప్రాంతంలోని 13 జిల్లాలు తీవ్రంగా నిర్లక్ష్యానికి గురయ్యాయయని విశాఖ ఎంపీ హరిబాబు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థలు ఒక్కటి కూడ ఈ ప్రాంతంలో రాలేదన్నారు. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటివరకు 11 సంస్థలను ఏర్పాటు చేయాలని భావించి 9 సంస్థలను ప్రారంభించినట్టుగా ఆయన హరిబాబు గుర్తు చేశారు.
రెవిన్యూలోటును తీరుస్తాం
ఏపీ రెవిన్యూలోటును తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు చెప్పారు. 2014 -15 ఏపీ రాష్ట్రం రెవిన్యూలోటు కింద కేంద్ర ప్రభుత్వం రూ.4వేల కోట్లు ఇచ్చిందన్నారు. 2015-16లో 6600 కోట్లను ఆర్ధికలోటుగా గుర్తించినట్టు చెప్పారు. ఆర్థికలోటును భర్తీ చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి జైట్లీ చేసిన ప్రకటనను హరిబాబు గుర్తు చేశారు.
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి
ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు వచ్చినా కానీ, నిధులు రాలేదని టిడిపి చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని బిజెపి కోర్ కమిటీ సమావేశం నిర్ణయించింది. ఈ తప్పుడు ప్రచారం కారణంగా రాజకీయంగా నష్టపోవాల్సి వస్తోందని బిజెపి నేతలు అభిప్రాయపడ్డారు. ఏపీకి ఇప్పటివరకు వచ్చిన నిధులపై ప్రజలకు వివరించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
ప్రత్యేక హోదాపై బాబు యూటర్న్
ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు యూ టర్న్ తీసుకొన్నారని బిజెపి కోర్కమిటీ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ఏపీకి కేంద్రం నుండి నిధులు రాలేదని టిడిపి నేతలు సమర్ధవంతంగా ప్రచారం చేశారని బిజెపి నేతలు కొందరు అంగీకరించారు.ఎన్డీఏలోనే కొనసాగుతూ టిడిపి మైండ్ గేమ్ ఆడుతోందని కొందరు నేతలు టిడిపి తీరును విశ్లేషించారు. దూకుడుగా వెళ్ళడం కంటే వ్యూహత్మకంగా వెళ్ళాలని ఈ సమావేశంలో కొందరు సీనియర్లు ప్రతిపాదించారు.