ఆయన దురదృష్టం, ఒక్కరే ఇష్టం: చిరు, ఏలూరే:కావూరి
రాజమండ్రి/ఏలూరు: ఎస్వీ రంగారావు చాలా గొప్ప నటులని, ఆయన ఇక్కడ పుట్టడం మనం చేసుకున్న అదృష్టం అయితే, ఆయన దురదృష్టమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఆదివారం అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో చిరంజీవి స్వర్గీయ ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను ఇష్టపడే నటుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఎస్వీఆర్ ఒక్కరేనని, ఇదే విషయాన్ని తాను గతంలోను చెప్పానని తెలిపారు. ఆయన ఇక్కడ పుట్టడం మనం చేసుకున్న అదృష్టమన్నారు. ఆయన మాత్రం ఇక్కడ పుట్టి దురదుష్టవంతులయ్యారన్నారు.
ఏ హాలీవుడ్లోను ఆయన పుట్టి ఉంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నటుడు అయ్యేవారన్నారు. ఎస్వీ రంగారావుతో నటించే అవకాశం రాకపోవడం బాధగా ఉందన్నారు. ఆయన సహజసిద్ధమైన నటన అందరినీ ఆకట్టుకుంటుందని, ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన అదృష్టమన్నారు.
అనంతరం చిరంజీవి పాపికొండల నుండి భద్రాచలం వరకు మెగా టూరిజం సర్క్యూట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వట్టి వసంత్ కుమార్, తోట నర్సింహం, పార్లమెంటు సభ్యులు హర్షకుమార్ పాల్గొన్నారు.
టి బిల్లు ఆమోదం పొందే అవకాశం లేదు: కావూరి
తాను ఎప్పటికి సమైక్యవాదినే అని కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఏమాత్రం లేదన్నారు. తనకు కాంగ్రెసు పార్టీని వీడే ఆలోచన లేదని, వచ్చే ఎన్నికల్లోను ఏలూరు నుండే పోటీ చేస్తానని తెలిపారు.