పార్టీల మాయలో పడొద్దు, మేం పిలువలేదు: అశోక్బాబు
హైదరాబాద్: తామెప్పుడు రాజకీయ నాయకులను గానీ, పార్టీలను గానీ ఉద్యమంలోకి ఆహ్వానించలేదని ఎపిఎన్జివోల అధ్యక్షుడు అశోక్బాబు అన్నారు. వారు వ్యక్తులుగానే ఉద్యమంలో పాల్గొనాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఎపిఎన్జివోలు పిలుపునిచ్చిన రెండు రోజుల బంద్ ముగిసిందని ఆయన తెలిపారు. ఉద్యోగులు శాంతియుతంగా ఉద్యమించాలని కోరారు. రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధించాలని మాత్రమే పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. రాజకీయ పార్టీల కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆయన ఉద్యోగులకు సూచించారు.
ఉద్యమంలో దాడులకు తావులేదని అన్నారు. దాడులు ఉద్యమాన్ని బలహీనం చేస్తాయని అన్నారు. రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఉద్యమానికి మద్దతు తెలపాల్సిన రాజకీయ నాయకులు.. ఉద్యమకారులపై దాడులు చేస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఉద్యమకారులపై దాడులు చేస్తే ఏమాత్రం సహించబోమని ఆయన హెచ్చరించారు. సమైక్య ఉద్యమానికి తూట్లు పొడవడమంటే తల్లిని అమ్ముకోవడమేనని అన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకుంటున్న రాజకీయ నాయకులు అసెంబ్లీకి వచ్చే విభజన తీర్మానాన్ని ఓడించి తమ నిజాయితీని నిరూపించుకోవాలని అన్నారు. సమైక్యవాదం పేరుతో ఒక పార్టీ నేతలపై మరో పార్టీ నేతలు దాడులు చేసుకుంటున్నారని విమర్శించారు. సమైక్య ఉద్యమంలో పెత్తనం చెలాయించాలని చూస్తే సహించమని అన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాజీనామా డ్రామాలను కట్టిపెట్టి ప్రధానికి తమ రాజీనామాలను ఇచ్చి కాపీలను పత్రికలకు విడుదల చేయాలని చెప్పారు.
జులై 30న సిడబ్ల్యూసి నిర్ణయం తర్వాత రాజీనామా చేయమంటే విభజన ప్రక్రియను ఆపుతామని రాజీనామాలు చేయకుండా తప్పించుకున్నారని, ఇప్పటికైనా తమ పదవులు వదులుకుని ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. ఇప్పుడు రాజీనామాలు చేయని ఎంపీలకు భవిష్యత్లో రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తాము విజయనగరం ముట్టడికి పిలుపు ఇవ్వలేదని ఆయన అన్నారు.
ఆదివారం ఎపిఎన్జివోల సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని అశోక్బాబు తెలిపారు. ఉద్యమంలో హింసాత్మక ఘటనలకు చోటులేదని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు గానీ చర్యలను గానీ రాజకీయ నాయకులు ప్రోత్సహించకూడదన్నారు. అలా చేస్తే సివిల్ వార్ తప్పదని హెచ్చరించారు. రాజకీయ నేతలతో చేయి కలపకూడదని ఉద్యోగ సంఘాల నాయకులను కోరారు. త్వరలోనే ఢిల్లీలో ఎపిఎన్జివోల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.