రాజకీయ పరిస్థితి, నేతల వ్యాఖ్యలు: మమ్మల్ని తెలంగాణకి పంపొద్దు!
హైదరాబాద్: జోన్ 5, 6లలో ఎంపికైన మొదటి నాలుగు జోన్లలో పని చేస్తున్న నీటి పారుదల శాఖ ఇంజినీర్లను ప్రభుత్వం తిరిగి తెలంగాణ రాష్ట్రానికి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తోందని పలువురు ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిని గురువారం మొదటి మూడు జోన్లలో ఉన్న ఇంజినీర్లు కలిశారు. తమను తిరిగి తెలంగాణ రాష్ట్రానికి పంపవద్దని కోరారు. తమను పంపిస్తే ఇబ్బందులు ఎదుర్కొనవలసి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమను పంపిస్తే ఆంధ్రా ప్రాంతానికి చెందిన తమను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధుల్లోకి తీసుకునే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులు, రాజకీయ యంత్రాంగం వ్యాఖ్యల కారణంగా తాము అక్కడ పని చేయలేమని, ఏపీలోనే ఉంటామని చెప్పారు.

ఇద్దరు డీటీసీ అధికారుల రిలీవ్
తెలంగాణ రాష్ట్రం ఏపీకి కేటాయించిన ఇద్దరు రవాణా శాఖ ఉప కమిషనర్లను విధుల నుండి రిలీవ్ చేసింది.
ఇదిలా ఉండగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్న రెండు జవహర్ నవోదయ స్కూల్లలో ఒకటి ఏపీ పరిధిలోకి వెళ్లింది. ఆరేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ఇరవై జిల్లాల్లో రెండు నవోదయలను నెలకొల్పారు. ఖమ్మం జిల్లాలో, ప్రకాశం జిల్లాల్లో రెండు నవోదయలు వచ్చాయి.
ఖమ్మం జిల్లాలో పాలేరులో ఒకటి ఉండగా, నెల్లిపాకలో రెండోది ప్రారంభించారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఏపీలో కలిశాయి. అందులో భాగంగా నెల్లిపాక మండలం తూర్పు గోదావరిలో విలీనమైంది. దీంతో, అక్కడి నవోదయ ఏపీకి వెళ్లింది.
ఆరో తరగతిలో ప్రవేశానికి గత ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించి ఇటీవలే ఫలితాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం ఆ పాఠశాల ఏపీలో విలీనమైనా పరీక్ష రాసిన ఖమ్మం జిల్లా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ఏం చేయాలో నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications