ట్విస్ట్: భూమా నాగిరెడ్డి పిల్లలైతే సరే, కానీ, శిల్పాకు జైకొట్టిన మల్కిరెడ్డి
నంద్యాలలో రాజకీయాలు వేడేక్కాయి. అధికార,విపక్షాల మధ్య మాటల యుద్దం సాగుతోంది. అంతేకాదు ఎత్తుకు పై ఎత్తులతో ఎన్నికలకు టిడిపి, వైసీపీలు సన్నద్దమౌతున్నాయి.భూమా నాగిరెడ్డి పిల్లలు ఈ స్థానం నుండి బరిలో దిగిత
కర్నూల్: నంద్యాలలో రాజకీయాలు వేడేక్కాయి. అధికార,విపక్షాల మధ్య మాటల యుద్దం సాగుతోంది. అంతేకాదు ఎత్తుకు పై ఎత్తులతో ఎన్నికలకు టిడిపి, వైసీపీలు సన్నద్దమౌతున్నాయి.భూమా నాగిరెడ్డి పిల్లలు ఈ స్థానం నుండి బరిలో దిగితే వైసీపీ ఏకగ్రీవానికి సిద్దమేనని ఆ పార్టీ నేత శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు.పదిరోజుల క్రితం పార్టీలో చేరిన శిల్పా మోహన్ రెడ్డికి టిక్కెట్టు కేటాయించడంపై తొలుత వైసీపీ ఇంచార్జ్ మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనస్థాపానికి గురయ్యారు. కానీ, తర్వాత ఆయన తన మనసు మార్చుకొన్నారు.శిల్పాకు టిక్కెట్టు కేటాయించడాన్ని ఆయన స్వాగతించారు. తాను టిడిపిలోకి వెళ్లబోనని ప్రకటించారు.
నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలను ఏకగ్రీవం చేయాలని టిడిపి నాయకత్వం చేసిన ప్రయత్నాలను వైసీపీ చెక్ పెట్టింది. ఈ ఎన్నికల్లో పోటీకి సిద్దమని ఆ పార్టీ ప్రకటించింది. ఏకంగా పదిరోజుల క్రితం నుండి టిడిపి నుండి పార్టీలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి టిక్కెట్టును కేటాయించింది వైసీపీ.
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికలు అధికార టిడిపి, విపక్ష వైసీపీకి ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను రెండు పార్టీలు సర్వశక్తులను ఒద్డుతున్నాయి.
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఎన్నికల్లో వచ్చే ఫలితాలు 2019 ఎన్నికలను ప్రతిబింబిస్తాయని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.ఈ ఎన్నికల్లో విజయం కోసం రెండు పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.
భూమా నాగిరెడ్డి పిల్లలు పోటీచేస్తే ఏకగ్రీవానికి ఒకే
నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికల్లో సంప్రదాయానికి వైసీపీ వ్యతిరేకంగా పనిచేయడం లేదని మాజీమంత్రి శిల్పా మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఈ నియోజకవర్గం నుండి భూమా నాగిరెడ్డి కొడుకు లేదా కూతురు పోటీచేస్తే వైసీపీ ఈ స్థానం నుండి అభ్యర్థిని బరిలోకి దింపకపోయేదంటున్నారు. కానీ, ఈ స్థానం నుండి భూమా నాగిరెడ్డి సోదరుడు వీరశేఖర్ రెడ్డి కొడుకు భూమా బ్రహ్మనందరెడ్డి టిడిపి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఈ కారణంగానే వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీచేస్తోందని శిల్పా చెబుతున్నారు.
రాజగోపాల్ రెడ్డి యూ టర్న్
మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి టిక్కెట్టు ఇవ్వడం పట్ల మనస్థాపానికి గురైన రాజగోపాల్ రెడ్డి యూ టర్న్ తీసుకొన్నారు. నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో శిల్పాకు టిక్కెట్టు కేటాయించడాన్ని ఆయన స్వాగతించారు. వైసీపీ చీఫ్ జగన్ తనకు న్యాయం చేస్తానని హమీ ఇచ్చారని ఆయన ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిగా ఉంటే తమకు కలిసివస్తోందని టిడిపి భావించింది.అయితే రాజగోపాల్ రెడ్డి యూ టర్న్ తీసుకోవడం టిడిపిని నిరాశపర్చింది.
వేగంగా మారుతున్న రాజకీయాలు
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఉపఎన్నికల ను దృష్టిలో ఉంచుకొని అధికార, విపక్షపార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. నంద్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని టిడిపి ప్రయత్నాలను ప్రారంభించింది. మాజీమంత్రి శిల్పా మోహన్ రెడ్డి వెంట టిడిపి కౌన్సిలర్లు, చైర్ పర్సన్ సులోచన వైసీపీ తీర్థం పుచ్చుకొన్నారు. అయితే శిల్పా వెంట వైసీపీలో చేరిన కౌన్సిలర్లను టిడిపిలో చేర్పించేందుకు ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నాను ప్రారంభించింది. తమకు ఏ అవకాశం కలిసివచ్చినా వినియోగించుకొనేందుకుఅధికార విపక్ష పార్టీలు ప్రయత్నాలను చేస్తున్నాయి.
వేడేక్కిన నంద్యాల రాజకీయాలు
నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలకాకముందే నంద్యాలలో రాజకీయపార్టీల మధ్య సవాళ్ళు, ప్రతిసవాళ్ళతో వేడేక్కాయి. ఉపఎన్నికల్లో టిడిపి ఓటమిపాలైతే దానికి తాను భాద్యతను వహిస్తానని ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ ప్రకటించడం సంచలనం సృష్టించింది. భూమా నాగిరెడ్డి 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ప్రజలకు చూపే ప్రయత్నాలను టిడిపి చేస్తోంది. ఈ స్థానంలో ఓటమిపాలైతే టిడిపికి ఇప్పటికిప్పుడు ఏమి కాకపోయినా రానున్న ఎన్నికల్లో ఇదేరకమైన ఫలితాలు వచ్చే అవకాశాలుంటాయనే సంకేతాలను ఈ ఎన్నికద్వారా తెలుసుకోనే వెసులుబాటు అధికారపార్టీకి దక్కనుంది. ఈ స్థానాన్ని వైసీపీ దక్కించుకొంటే ఆ పార్టీలో నూతన ఉత్తేజం రానుంది.