భయమొద్దు, ఇక పోటీ: వెంకయ్య, సోనియా వల్లే: డిఎస్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉండేందుకు ఎవరు భయపడవల్సిన అవసరం లేదని, తామైతే భయపడలేదని, ఎవరైనా భయపడినా.. ఆ అవసరం లేదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఆదివారం అన్నారు. తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన తర్వాత పలువురు తెలంగాణ నేతలు హైదరాబాదులో భయపడాల్సిన అవసరం లేదని ప్రకటనలు చేశారని గుర్తు చేశారు.
విభజన జరిగిపోయిందని, ఇక అన్నీ మర్చిపోయి కలసిమెలసి ముందుకు సాగాలని తెలుగు ప్రజలకు సూచించారు. తెలంగాణ, సీమాంధ్రలు అభివృద్ధిలో పోటీ పడాలని పిలుపునిచ్చారు. తెలంగాణపై తాము ఇచ్చిన మాటను నిలుపుకున్నామని అయితే, కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రులకు న్యాయం చేయడంలో విఫలమైందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో మాట్లాడడం ఇష్టంలేకున్నా, విభజన అంశంపై 15 రోజుల పాటు చర్చలు జరిపానని వెల్లడించారు.
తెలంగాణ ఘనతను ఎవరికి ఇవ్వాలో ప్రజలే నిర్ణయించుకుంటారన్నారు. ఇరు ప్రాంతాలను అభివృద్ధి చేసే సత్తా ఎవరికి ఉందో ప్రజలు గుర్తించాలని సూచించారు. ముందుచూపు లేకుండా వ్యవహరించి కాంగ్రెసు పార్టీ సీమాంధ్రకు అన్యాయం చేసిందని ఆరోపించారు. సీమాంధ్రకు న్యాయం చేసేందుకు తన వంతు కృషి చేశానన్నారు.
చంద్రబాబుపై గుత్తా
తెలంగాణను అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వేసిన ఎత్తులను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చిత్తు చేశారని పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రెండు నాల్కల ధోరణితో రెండు ప్రాంతాల్లోనూ టిడిపి పతనం ఖాయమన్నారు.
సోనియా వల్లే: డిఎస్
తెలంగాణ ప్రజల అరవయ్యేళ్ల కలను సోనియా గాంధీ నిజం చేశారని పిసిసి మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్ అన్నారు. సోనియాకు తాము రుణపడి ఉంటామన్నారు. ఎవరు వెనక్కి పోయినా సోనియా పట్టుదల కారణంగా తెలంగాణ సాధ్యమైందన్నారు. తెలంగాణ ఏర్పడదని కిరణ్ సహా పలువురు అన్నారన్నారు. హైదరాబాదులో ఉన్నవారంతా తెలంగాణ వారేనని, ప్రస్తుత తరుణంలో సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు చేయరాదన్నారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్లమెంటు ఉభయసభల్లో తెలంగాణ బిల్లును సోనియా పాస్ చేయించారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను మేడమ్ నిలుపుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకు కిరణ్ కుట్ర చేశారని ఆరోపించారు. ఇకపై నేతలు ప్రాంతీయ విద్వేషాలకు తావులేకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పాటుపడాలని పిలుపునిచ్చారు.
అనువైన చోట రాజధాని: జెడి శీలం
అందరికీ అనువైన చోట కొత్త రాజధాని ఉంటుందని కేంద్రమంత్రి జెడి శీలం చెప్పారు. హైదరాబాదులా కాకుండా సీమాంధ్రలో అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ ఉంటుందన్నారు. సీమాంధ్రలో రాజధాని ఎక్కడన్న అంశాన్ని నిర్ణయించడానికి త్వరలోనే కమిటీ ఏర్పాటవుతుందని చెప్పారు. కర్నూలులోనే రాజధానిని ఏర్పాటు చేయాలని లేకుండే రెండు ప్రాంతాల్లో రెండు రాజధానులు ఏర్పాటు చేయాలని టిజి వెంకటేష్ వేరుగా అన్నారు.