ఎలా విభజిస్తారు: విభజనకు అసద్ నో, హైదరాబాద్ టిదే
హైదరాబాద్: తాము రాష్ట్ర విభజనకు పూర్తి వ్యతిరేకమని, అనివార్యమైతే రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ బుధవారం చెప్పారు. విభజన పైన మంత్రుల బృందానికి(జివోఎం)కు మజ్లిస్ 46 పేజీల నివేదికను పంపించింది. ఈ నేపథ్యంలో మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని అసద్ డిమాండ్ చేశారు. అనివార్యమైతే రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. నగరం పైన కేంద్రం పెత్తనాన్ని తాము సహించేది లేదన్నారు. కేంద్రానికి ఎలాంటి అధికారాలు ఉండవద్దన్నారు. కేబినెట్ నోట్లో హైదరాబాదు పైన ఎలాంటి స్పష్టత లేదన్నారు. నగర శాంతిభద్రతలను కేంద్రానికి అప్పగించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
కేబినెట్ నోట్ పైన తమకు చాలా అనుమానాలున్నాయని చెప్పారు. విభజన జరిగితే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ మరింత విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాదు తెలంగాణ ప్రాంతంలోనిదే అన్నారు. కేంద్రం తెలంగాణకు మొగ్గు చూపితే రాజధానిగా హైదరాబాదును ఉంచాలన్నారు. ఉమ్మడి రాజధానిగా చేస్తే తాము అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణ రాజధానిగా హైదరాబాదును చేయాలని డిమాండ్ చేశారు.
సీమాంధ్ర ప్రజలు కేవలం హైదరాబాదులోనే లేరన్నారు. తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నారని చెప్పారు. అలాంటప్పుడు అన్ని ప్రాంతాలను కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణలోని సీమాంధ్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం రక్షణ కల్పించకపోతే ఆర్టికల్ 3ను ఉపయోగించాలని సూచించారు. విభజన జరిగితే హైకోర్టును ఎలా విభజిస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి సీటు కోసం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. విభజన అనివార్యమైతే సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పాటు కోసం సత్వర చర్యలు చేపట్టాలన్నారు. టి కాంగ్రెసు నేతల మాటలు హాస్యాస్పదమన్నారు. విభజనతో రాయలసీమ ఎక్కువగా నష్టపోతుందని, రాయల తెలంగాణే అందుకు పరిష్కారం అన్నారు. ఆస్తులు కాపాడుకునేందుకే కొందరు యుటి అంటున్నారని విమర్శించారు.