మాది అదే: సొంత నేతలకి బొత్స కౌంటర్, కిరణ్పై షబ్బీర్
హైదరాబాద్: అధిష్టానాన్ని ధిక్కరిస్తూ రాజ్యసభ ఎన్నికల బరిలో దిగుతున్న సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నాయకులపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్రలో ఉన్న కాంగ్రెసు నేతలంతా సమైక్యవాదులే అన్నారు. సమైక్యవాదంతో ఎన్నికల బరిలోకి దిగుతామని కొంతమంది వితండవాదం చేస్తున్నారన్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీకి ఎవరితోను పొత్తులుండవన్నారు. తాము ఎవరి మద్దతును తీసుకునేది లేదని చెప్పారు. కాంగ్రెసు పార్టీకి చెందిన వారంతా అధిష్టానం చెప్పిన అభ్యర్థులకే ఓటు వేస్తారని చెప్పారు.
అయోమయం: షబ్బీర్ అలీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజల్లో అయోమయం నెలకొందని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. కిరణ్ ఏడు గంటలు మాట్లాడి ఇప్పుడు బిల్లును వెనక్కి పంపించాలని చెప్పడమేమిటని ప్రశ్నించారు. ఆర్టికల్ 3 ముందు 77 నిలబడదని చెప్పారు. రాజ్యాంగ బద్దంగా వచ్చిన బిల్లును అడ్డుకోవద్దన్నారు. కిరణ్ ఇచ్చిన నోటీసు కొత్తదేం కాదని, జగన్ పార్టీ రోజు ఇచ్చే నోటీసునే కిరణ్ ఇచ్చారు. విజయమ్మ నోటీసు తిరిగిచ్చినట్లే కిరణ్ నోటీసు తిరిగిస్తారన్నారు.
కిరణ్ లేఖపై స్పీకర్దే నిర్ణయం: దానం
కిరణ్ ఇచ్చిన లేఖపై సభాపతిదే తుది నిర్ణయమని మంత్రి దానం నాగేందర్ చెప్పారు. స్పీకర్ నిర్ణయం తర్వాత తాను స్పందిస్తానని అన్నారు. తెలంగాణ కాంగ్రెసు పార్టీకి ప్రతిష్టాత్మక సమస్య అన్నారు. కేబినెట్లో ఐక్యత లేకపోవడం వల్లనే కిరణ్ ఒంటరిగా నోటీసు ఇచ్చారన్నారు.
నవ్వుకుంటున్నారు: విహెచ్
కిరణ్ తీరును చూసి అందరూ నవ్వుకుంటున్నారని కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు అన్నారు. బిజెపివి ఓటు బ్యాంకు రాజకీయాలని విమర్శించారు.