'వైఎస్ జగన్ అనే నేను.., ధర్మపోరాటం ఓ దొంగదీక్ష, ప్రజలే బలయ్యారు!'
విశాఖపట్నం: ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు మోసాలను, బీజేపీ నిర్లక్ష్య వైఖరిని ఉపేక్షించేది లేదని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. సోమవారం విశాఖపట్నంలో నిర్వహించిన 'నయవంచన దీక్ష'కు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రత్యేక హోదాను నీరుగార్చిందే చంద్రబాబు అని, హోదా కోసం ఎంతదాకైనా పోరాడుతామని ప్రతినబూనారు.
హోదా తప్ప ఏది ఆమోదయోగ్యం కాదు..:
ప్రత్యేక హోదా ఆంధ్రుల ఊపిరి అని, దానితోనే రాష్ట్రాభివృద్ధి ముడిపడి ఉందని వైసీపీ నేతలు మరోసారి ప్రజలకు వివరించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా.. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలన్నా.. పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి సాధించాలన్నా హోదాయే మార్గమని తేల్చి చెప్పారు. హోదా తప్ప ఏది ఇచ్చినా ఆమోద యోగ్యం కాదని, తమకు జాతీయ రాజకీయాలతో పని లేదని అన్నారు.
బాబు దొంగదీక్షలు:
రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ఎవరు ప్రత్యేక హోదా ఇస్తామంటే వారికే తమ మద్దతు ఉంటుందని వంచన దీక్ష వేదికగా వైసీపీ నేతలు మరోసారి స్పష్టం చేశారు. హోదా విషయంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైందని, ఇప్పుడు ధర్మ పోరాటం అంటూ దొంగదీక్షలకు తెరదీస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు హోదాపై నిజంగా చిత్తశుద్ది ఉంటే.. సీఎం పదవి చేపట్టిన నాటి నుంచే కేంద్రంపై ఒత్తిడి తెచ్చేవారని అన్నారు.
ప్రజలే బలయ్యారు:
చంద్రబాబు అబద్దాల కోరుతనం, మోడీ అహంకారానికి రాష్ట్ర ప్రజలు బలైపోయారని వైసీపీ నేతలు మండిపడ్డారు. భవిష్యత్తులో హోదా పోరు మరింత ఉధృతమవుతుందే తప్ప ఆగేది ఉండదని ప్రకటించారు. నయవంచన దీక్షలో మొత్తం ఆరుగురు ఎంపీలు, 33 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు, పెద్ద సంఖ్యలో ముఖ్య నేతలు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నేతలంతా నల్లదుస్తుల్లో దీక్షకు హాజరయ్యారు.
'వైఎస్ జగన్ అనే నేను:
'వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను.. సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్నాను' అని జగన్ నోటి వెంట వినాలని ఎదురుచూస్తున్నట్టు ఓ ఎమ్మెల్యే తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు నేతలు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది.
కాగా, ఉదయం 7 గంటలకు ప్రారంభమైన నిరాహారదీక్ష రాత్రి 7 గంటల వరకూ సాగింది. తొలుత పార్టీ నేతలంతా వేదికపై ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.