వ్యూహం మార్చాం: సబ్బం, జనవరిదాకా: టిపై లగడపాటి
తాము తమ వ్యూహాన్ని మార్చుకున్నామని సబ్బం చెప్పారు. వచ్చే శుక్రవారం వరకు నోటీసు ఇస్తామన్నారు. తమ అవిశ్వాస తీర్మానానికి శివసేన, బిజెడి, అన్నాడిఎంకె, యడ్యూరప్ప, శ్రీరాములు పార్టీలు మద్దతిస్తున్నాయని చెప్పారు. ఇంత మద్దతు లభించడం ఆనందాన్నిస్తోందన్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో విభజనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు.
అనేక ఎత్తులతో వెళ్తున్నాం: లగడపాటి
తాము సమైక్యాంధ్ర కోసం అనేక ఎత్తులతో ముందుకు వెళ్తున్నామని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. తమకు పలు పార్టీల మద్దతు లభించిందన్నారు. తమకు మద్దతు తెలిపిన వారిని ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నందునే తాము ఈ రోజు అవిశ్వాస తీర్మానంపై నోటీసు ఇవ్వలేదన్నారు. బుధవారం ఎట్టి పరిస్థితుల్లో ఇస్తామన్నారు.
అవిశ్వాసాన్ని ప్రవేశ పెట్టి నెగ్గించుకోగలిగితే కేంద్రం విభజనపై ఎలా ముందుకు వెళ్తుందో చూస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యం కోసం పాటుపడుతున్నారన్నారు. జనవరి దాకా అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పైన చర్చ జరిగే అవకాశం లేదన్నారు. తాము రేపు అవిశ్వాసంపై చర్చకు పట్టుబడతామన్నారు. తమకు పార్టీల మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.