నో జగన్: సోనియా వైపే సబితా ఇంద్రారెడ్డి తనయుడు
హైదరాబాద్: ఎలాంటి ఆంక్షలు లేని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కృతజ్ఞత తెలుపుతూ నవ నిర్మాణ్ పేరుతో ఆయన పాదయాత్ర చేపట్టారు. బుధవారం ఉదయం ఆయన ఆరె మైసమ్మ గుడిలో పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దీన్నిబట్టి కార్తిక్ రెడ్డి వైయస్ జగన్ పార్టీకి వెళ్లే అవకాశాలు లేవని అర్థమవుతోంది. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారంటూ ప్రచారం సాగింది.
తన తండ్రి ఇంద్రారెడ్డి ఆశయం తెలంగాణ రాష్ట్రమని కార్తీక రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ నవ నిర్మాణ బాధ్యత కాంగ్రెస్ పార్టీపైనే ఉందని కార్తీక్ రెడ్డి అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజక వర్గంలో 101 కిలోమీట్లు పాదయాత్ర చేయనున్నట్లు కార్తీక్రెడ్డి తెలిపారు. జనవరి 12న తాండూరులో తన పాదయాత్ర ముగుస్తుందని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు కార్తీక్రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ విషయంలో సోనియాగాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ.. తెలంగాణ ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సబిత చెప్పారు.
సభలో పాల్గొన్న మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం ఈ ప్రాంత నేతలు ఇంద్రారెడ్డి, కెవి రంగారెడ్డి, చెన్నారెడ్డిలు పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ పునర్మిర్మాణానికి యువత అంకితమవ్వాలని జానారెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పెట్టని కోటలా నిలబడాలని జానారెడ్డి కోరారు. తెలంగాణ ప్రజలు సుపరిపాలనకు సహకరించాలని అన్నారు.