గర్వపడేలా ఆధునాతన రాజధాని, విభజన నిరాశే: చంద్రబాబు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ఆధునాతన, ఇక్కడి ప్రజలు గర్వపడే రాజధానిని నిర్మిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రజలకు మంచి చేయాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ప్రగతి పథంవైపు దూసుకెళ్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో చైనాతోనే అభివృద్ధిలో పోటీ ఉంటుందని చెప్పారు.
బుధవారం సాయంత్రం విశాఖలోని ఏయూలో జరిగిన ప్రతిభాపురస్కారాల ప్రదాన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా అధిగమించేందుకు విద్యార్థులు సన్నద్ధం కావాలని అన్నారు. కష్టాలను ఒక సవాలుగా తీసుకుని ముందుకెళ్లాలని ఆయన సూచించారు.
విశాఖలో హుధుద్ తుపాను వస్తే ముందు చాలా భయపడ్డామని, 9 రోజుల్లో సర్వశక్తులు ఒడ్డి విశాఖను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చామని ఆయన గుర్తుచేశారు. ఏదైనా ఒక ప్రణాళిక ప్రకారం పాటిస్తే ముందుకెళ్లడం ఖాయమని చంద్రబాబు అన్నారు.
2025 నాటికి ఇంగ్లీష్ అధికంగా మాట్లాడే దేశంగా భారత్ ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు. ఐటీ ఉద్యోగులు మనదేశంలోనే అధికంగా ఉన్నారని, రాబోయే రోజుల్లో భారత్, చైనా మధ్యే పోటీ ఉంటుందని అయన అంచనావేశారు.
రాష్ట్ర విభజన తర్వాత చాలా మంది నిరాశకు గురయ్యారని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. విద్యార్థుల ఆలోచనా తీరు అద్భుతంగా ఉందని, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్తో పోటీ పడాలని ఆయన విద్యార్ధులకు పిలుపునిచ్చారు. కోస్తా తీరంలో ఉండే రాష్ర్టాలు ఎంతో అభివృద్ధి చెందాయని, కోస్తాను ఎగుమతులు, దిగుమతులకు స్థావరంగా మారుస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.