25 రోజులే కీలకం, దీదీని కలుస్తాం: విభజనపై అశోక్
హైదరాబాద్: రాబోయే రోజుల్లో సమైక్య రాష్ట్ర ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు ఎపిఎన్జివో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై జాతీయ పార్టీల నేతలను కలుస్తామని, పార్లమెంటులో బిల్లును అడ్డుకోవాలని కోరతామని అన్నారు. రాబోయే 25రోజులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీలకంగా మారనున్నాయని ఆయన అన్నారు.
నవంబర్ 24 ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని అశోక్ బాబు తెలిపారు. ఉద్యమాన్ని ఉధృతం చేసే అంశం కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. శుక్రవారం అమలాపురంలో సమైక్య సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నవంబర్ 29 అనంతరపురంలో, డిసెంబర్ 2న మదనపల్లిలో సమైక్య సభలను నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.
హైదరాబాద్, తెలంగాణలోని ఎమ్మెల్యేలను కలిసి సమైక్య రాష్ట్రానికి మద్దతివ్వాలని కోరతామని అశోక్ బాబు అన్నారు. డిసెంబర్ నెల మొదటి వారంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసి సమైక్య రాష్ట్రానికి మద్దతు ఇవ్వాలని, పార్లమెంటులో బిల్లును అడ్డుకోవాలని కోరతామని ఆయన తెలిపారు.
రాష్ట్రాన్ని విడదీయవద్దని తాము మొదటి నుంచీ చెబుతూ వస్తున్నామని ఆయన అన్నారు. విభజిస్తే రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని ఆయన అన్నారు. విభజనపై కేంద్రం ఎందుకు వేగంగా ముందుకు వెళ్తుందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. 11 అంశాలపై స్పష్టం చేయకుండా బిల్లు పార్లమెంటుకు వెళ్తే వ్యతిరేకిస్తామని ఆయన అన్నారు.