కడపలో ఆపరేషన్ ఆకర్ష్కు ఎదురుదెబ్బ: 'వైసీపీలోనే కొనసాగుతాం'
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా వైసీపీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు ఉత్సాహాం చూపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కడప నగర కార్పోరేటర్లు టీడీపీకి చేరుతున్నట్లు ఆదివారం వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో కడప కార్పోరేటర్లు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24వ తేదీన నారా లోకేశ్ సమక్షంలో సైకిల్ ఎక్కనున్నట్లు వచ్చిన వార్తలను వారు ఖండించారు. తామంతా వైసీపీలోనే కొనసాగుతామని, ఇతర పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని కడప కార్పోరేటర్లు కుండబద్దలు కొట్టి చెప్పారు.

దీనిపై సోమవారం వైసీపీకి పార్టీకి చెందిన కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మునిగే నావలాంటిదని వారు పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ను తాము వీడే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్రెడ్డి, ఎమ్మెల్యే అంజద్బాషా, మేయర్ సురేష్బాబు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో వైసీపీకి షాక్
విజయనగరం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగలనుందనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. ఇప్పటికే విజయనగరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడితో నారా లోకేశ్ మాట్లాడినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా పలువురు ప్రజాప్రతినిధులు టీడీపీ చేరనున్నారనే వార్తలు వస్తున్నాయి.
మరోవైపు విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నేతలు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. దీనిపై జిల్లాకు చెందిన వైసీపీ నేత కోలగట్ల మాట్లాడుతూ తాను వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమన్నారు. తెలుగుదేశం పార్టీ మైండ్ గేమ్ ఆడుతుందని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications