కేసీఆర్ నన్ను సవాల్ చేశారు, మావాళ్లవి మేమే: బాబు
హైదరాబాద్/విజయవాడ: విభజనతో సమస్యలు వస్తాయని తాను ముందే చెప్పానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనకు సవాల్ విసిరినట్లుగా పత్రికలలో చూశానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో అన్నారు. అభివృద్ధిలో పోటీ పడదామని కేసీఅర్ అన్నట్లుగా చూశానని, ఆ విషయం తాను మొదటి నుండి చెబుతున్నానని అన్నారు. సింగపూర్ కట్టుకుంటారు కానీ ఫీజులు చెల్లించలేరా అని కేసీఆర్ అన్నారన్నారు.
మొదట మనం భారతీయులమని, ఆ తర్వాతే ఆయా రాష్ట్రాల వారిమన్నారు. ఏపీలో నాలుగు మెగా, 13 స్మార్ట్ సిటీలను నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యత 67 శాతం మాత్రమే ఉందని, దీన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం కూడా చాలా తక్కువుగా ఉందని, వచ్చే ఐదేళ్లలో తలసరి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ ను 2029 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి 7 మిషన్లు రూపొందించామని వెల్లడించారు. స్వయం సహాయక సంఘాలు ఏపీకి పెద్ద వనరులని, ప్రతి కుటుంబంలో ఒకరు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండేలా చూడాలన్నారు. పట్టణాభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై కూడా తాము దృష్టి పెడతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పట్టణాల్లో లభించే సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. సేవలు, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
సేవల రంగంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. సర్వీస్ సెక్టార్లో ఎక్కువ మందికి ఉపాధి కూడా కల్పించవచ్చని చెప్పారు. అందుకే సర్వీస్ సెక్టార్ అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
కాగా, తెలంగాణలోని ఏపీ విద్యార్థుల ఫీజులు తామే కట్టుకుంటామని, ఎందరు ఏపీ విద్యార్థులు ఉన్నారో తెలంగాణ ప్రభుత్వమే తేల్చాలన్నారు. తెలుగుదేశం రెండు రాష్ట్రాలలో ఉందని చెప్పారు. తమకు రెండు ప్రాంతాలు ముఖ్యమని చెప్పారు. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నామని, అలాగే ఏపీలో అధికారంలో ఉన్నామని చెప్పారు.
రఘువీరా రెడ్డి నిప్పులు
రుణమాఫీ పైన చంద్రబాబు జాప్యం ఎందుకు చేస్తున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ప్రశ్నించారు. ఐస్ కత్తిలా చంద్రబాబు నొప్పి తెలియకుండా కత్తిరిస్తారన్నారు. రుణమాఫీపై జాప్యం చేస్తే రోడ్ల పైకి వస్తారని హెచ్చరించారు.