కాల్ మనీ ఘోరాల్ని బయటకు చెప్పలేం, అన్నీ పుకార్లు: సిపి సవాంగ్
విజయవాడ: కాల్ మనీ వ్యవహారంపై పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ స్పందించారు. ఈ కేసు వెనుక ఎవరు ఉన్నా విడిచి పెట్టేది లేదని ఆదివారం స్పష్టం చేశారు. కాల్ మనీ దందాలో కీలకంగా వ్యవహరించిన యలమంచిలి శ్రీరామమూర్తి, దూడల రాజేష్లను అరెస్టు చేసినట్లు చెప్పారు.
వారి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. కాల్ మనీ వ్యవహారం పైన జరుగుతున్న దర్యాప్తులో తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని తెలిపారు. కేసులో ప్రమేయం ఉన్నవారు ఎంతటివారైనా వదలమని తెలిపారు. కేసు దర్యాప్తులో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్నారు.
అవసరం కోసం అప్పు తీసుకునే మహిళలను, ఇతరులను అదే అదనుగా అన్ని విధాలా దోచుకునే కాల్ మనీ తరహా నీచమైన విష సంస్కృతికి చరమ గీతం పాడాల్సి ఉందని సిపి గౌతం సవాంగ్ అన్నారు. ఆయన ఆదివారం రాత్రి పది గంటలకు కమిషనరేట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కాల్ మనీ ఘోరాలకు ఈ కేసు ఒక నిలువెత్తు ఉదాహరణ అన్నారు. ఓ మహిళకు అప్పు ఇస్తామని ఖాళీ చెక్కులు తీసుకొని, వాటిని బ్యాంకులో డ్రా చేసి, తర్వాత ఆమెను బెదిరించి రకరకాలుగా దోచుకున్నారని, ఆ కేసులో ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం ఏడుగురిపై అభియోగాలు నమోదు చేశామన్నారు.
ఇద్దరిని అరెస్టు చేశామని, ట్రాన్స్ కో డీఈ సత్యానందం సహా మరో ఐదుగురి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి, డిజిపి ఆదేశాల మేరకు సమగ్రంగా దర్యాఫ్తు చేస్తున్నామని, పోలీసుల తీరుపై ఎలాంటి సందేహాలు వద్దన్నారు.
ఇందులో ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకుల పాత్ర పైన వస్తున్నవన్నీ ఊహాగానాలే అన్నారు. కొందరు పోలీసు అధికారుల పాత్ర పైన ఇప్పుడే చెప్పలేమన్నారు. కాల్ మనీ రాకెట్ అకృత్యాల పైన పెద్ద సంఖ్యలో బాధితుల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయన్నారు. ఆ ఘోరాలను బయటకు వివరించలేమన్నారు.
కొత్త రాష్ట్రంలో, కొత్త రాజధానిలో ఎలాంటి అక్రమాలనైనా త్వరగా గుర్తించి అదుపు చేస్తామని చెప్పారు. కాల్ మనీ చట్ట వ్యతిరేకమన్నారు. స్వర్ణ బార్ కల్తీ మద్యం కేసులో సిట్ దర్యాఫ్తు చేస్తోందని చెప్పారు. పరారీలో ఉన్న మల్లాది విష్ణు కోసం వెతుకుతున్నట్లు చెప్పారు.
కాగా, కాల్ మనీ, సెక్స్ రాకెట్ కుంభకోణంలో కీలక నిందితుల పైన ప్రభుత్వం కొరఢా ఝులిపిస్తోంది. కేసులో ఏ4 నిందితుడైన బెజవాడ సర్కిల్ డీఈ సత్యానందంను ఆదివారం సస్పెండ్ చేసింది. వడ్డీ వ్యాపారులు అప్పు తీసుకున్న మహిళలను బెదిరించి లైంగికంగా దోచుకుంటున్న సెక్స్ రాకెట్ గత గురువారం బయటపడిన విషయం తెలిసిందే.