అవిశ్వాసానికి మద్దతు, ఎన్ని పార్టీలు వస్తాయో: జగన్
న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం చెప్పారు. అవిశ్వాస తీర్మానానికి ఇంకా ఎన్ని పార్టీలు మద్దతి ఇస్తాయో చెప్పలేమన్నారు. అసెంబ్లీలో కూడా తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా తమ పార్టీ శాసన సభ్యులు ఓటు వేస్తారని జగన్ చెప్పారు.
బిజెపి నేతలను కలిసిన టిడిపి ఎంపీలు
తమ అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు శివప్రసాద్, కొణకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు లాల్ కృష్ణ అద్వానీ, వెంకయ్య నాయుడులను కోరారు. వారి నుండి ఏం హామీ వచ్చిందో తెలియాల్సి ఉంది.
ఉభయ సభలు వాయిదా
పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా పడ్డాయి. లోకసభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు సేవ్ ఆంధ్రప్రదేశ్, జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ మీరా కుమార్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా విపక్షాలు ఆందోళనకు దిగడంతో రాజ్యసభ మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా పడింది.