'మా సహనాన్ని పరీక్షించొద్దు', 'పార్టిని బతికించుకొనేందుకే బిజెపి మాటలు
హైదరాబాద్: ఏపీ రాష్ట్రానికి ఇస్తామని చెప్పిన నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని టిడిపి ఎంపీ కొనకళ్ళ నారాయణ తేల్చి చెప్పారు.మార్చి 5వ, తేది నుండి జరిగే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో కూడ ఏపీ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయమై పోరాటాన్ని కొనసాగిస్తామని నారాయణ చెప్పారు. ఏపీకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
Recommended Video
2018 బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే విషయమై పార్లమెంట్ ఉభయ సభల్లో ఏపీకి చెందిన ఎంపీలు నిరసనలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న టిడిపి ఎంపీలు కూడ నిరసనలు వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.
ఏపీకి నిధుల కేటాయింపు విషయంలో టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఈ తరుణంలో టిడిపి నేతలు కూడ రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే బిజెపితో తెగతెంపులు చేసుకొంటామని చెబుతున్నారు.
అన్యాయం జరిగితే ఊరుకోం
ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకోబోమని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణ అభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్రానికి నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హమీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. మార్చి 5వ, తేది నుండి జరిగే రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి నిధుల విషయమై పట్టుబట్టనున్నట్టు చెప్పారు. ఒకవేళ కేంద్రం స్పందించకపోతే చూస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదని కొనకళ్ళ నారాయణ స్పష్టం చేశారు. మిత్రపక్షంగా ఉండి కూడ తాము ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నామనే విషయాన్ని కేంద్రం గుర్తుంచుకోవాలని నారాయణ కోరారు.
బిజెపిని బతికించేందుకే హరిబాబు మాటలు
ఏపీ రాష్ట్రంలో బిజెపిని బతికించాలనే ఉద్దేశ్యంతోనే విశాఖ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు మాటలున్నాయని టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు. ఏపీ విభజన చట్టం ప్రకారంగా రాష్ట్రానికి దక్కాల్సిన నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన నిధుల విషయంలో హరిబాబు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు.
బిజెపితో తాడోపేడో తేల్చుకొంటాం
ఏపీకి నిధులు కేటాయింపు విషయంలో కేంద్రం నుండి సానుకూల సంకేతాలు రాకపోతే తాడోపేడో తేల్చుకొంటామని ఏపీ డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి చెప్పారు. రాజమండ్రిలో కెఈ కృష్ణమూర్తి ఈ మేరకు బిజెపిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చేనెల 5 వరకు వేచి చూస్తామని, తమ సహనాన్ని ఇంకా పరీక్షించవద్దని వ్యాఖ్యానించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయం జాతీయ అంశంగా మారిందని, తమకు న్యాయం చేయాల్సిందేనని అన్నారు.
టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్దం
ఏపీకి నిదుల కేటాయింపు విషయమై టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్దం చోటు చేసుకొంది. నిధులు ఏపీకి ఇచ్చామని బిజెపి నేతలు చెబుతున్నారు. ఇచ్చిన హమీలను నెరవేర్చలేదని టిడిపి నేతలు బిజెపిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే బడ్జెట్లో అరకొర కేటాయింపుల విషయమై టిడిపి నేతలు బిజెపిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో మిత్రపక్షాలుగా ఉన్న రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది.