weather: ఏపీలో రానున్న మూడు రోజుల్లో పలుచోట్ల ఉరుములుమెరుపులతో కూడిన వర్షాలు
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కాగా, తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు. ఉత్తరకోస్తాంధ్ర, యానాం ప్రాంతంలో ఆదివారం పొడిగా ఉండే అవకాశం ఉంది.
సోమవారం మాత్రం పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం పలు చోట్ల వాతావరణం పొడిగా ఉండనుంది. ఇక, దక్షిణ కోస్తాంధ్రలో నేటి నుంచి రానున్న మూడు రోజులపాటు పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
రాయలసీమ జిల్లాల్లో ఆదివారం పొడి వాతావరణం ఉండనుంది. అయితే, సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉరుములుమెరుపులతో కూడిన వర్షం పడుతుందని చెప్పారు.