బాబోయ్ చలి.. రానున్న రోజుల్లో మరింత వణికించనుందా !
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరగనుందని భారత వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. ఫిబ్రవరి 2వ తేదీ వరకు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున తీవ్ర చలి పరిస్థితులు ఉంటాయని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో వణికించే చలి..
ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో చలి మరింత ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశముందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది.

ఈ మేరకు మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో ఉదయం 9 గంటల వరకు పొగమంచు ఉండే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. పొగమంచు కారణంగా రహదారులపై దృశ్యమానత తగ్గే ప్రమాదం ఉందని, వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించింది.
తెలంగాణలో అన్ని జిల్లాల్లో చలి ప్రభావం..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయని పేర్కొంది. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేసింది.
ప్రజలకు వాతావరణ శాఖ సూచనలు..
తీవ్ర చలి నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప తెల్లవారుజామున ఇళ్ల నుంచి బయటికి రావద్దని వాతావరణ శాఖ సూచించింది. చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఉదయం, రాత్రి వేళల్లో తగినంత వెచ్చని దుస్తులు ధరించాలని, రైతులు పంటలను చలిగాలుల నుంచి రక్షించే చర్యలు చేపట్టాలని సూచించింది.
అయితే చలి తీవ్రత, పొగమంచు ప్రభావంతో పంటలపై కొంత మేర ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే పొగమంచు కారణంగా రోడ్డు, రైలు రవాణాలో ఆలస్యాలు చోటుచేసుకునే అవకాశముందని తెలిపారు. డ్రైవర్లు హెడ్లైట్లు వినియోగిస్తూ, తక్కువ వేగంతో ప్రయాణించాలని సూచనలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications