విషాదం: ప్రముఖ కవి, రచయిత మద్దా సత్యనారాయణ ఆత్మహత్య, అవార్డు అందుకున్న తర్వాతే..
తూర్పుగోదావరి: జిల్లాలోని కరప మండలం గురజనాపల్లిలో విషాదం ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ కవి, సామాజిక కార్యకర్త మద్దా సత్యనారాయణ(70) బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.
విజయవాడ శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య: తల్లిదండ్రులకు ఫోన్లు, వచ్చేలోగానే..
కుటుంబంలో వివాదం.. విషాదంగా మారింది..
గురజనాపల్లికి చెందిన మద్దా సత్యనారాయణ భారత వాయుసేనలో పనిచేసి రిటైరయ్యారు. కాగా, బుధవారం సాయంత్రం కుటుంబంలో వివాదం జరిగింది. క్షణికావేశంలో ఆయన పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. పురుగుల మందు తాగిన తర్వాత ఆయనను కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
మద్దా సత్యనారాయణ కవి, రచయితే కాదు..
కాగా, మద్దాకు సాహిత్యంపై మక్కువ ఉండటంతో తెలుగు భాషపై పట్టు సాధించారు. జ్ఞానచంద్రిక బాల సాహిత్య శతక కావ్యం, పెద్దల మాట చద్ది మూట, మద్దా వారి మణిపూసలు, తరువోజ, బధిరుడు, పదవులున్నోళ్లకు పసుపు కుంకుమలు, ఆశాజ్యోతి అంబేద్కర్, నల్లధనంపై వేటు వంటి ఎన్నో ఆసక్తికర రచనలు ఆయన చేశారు.
అంతేగాక, అక్షర సత్య అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు కూడా చేశారు. రిటైర్మెంట్ అనంతరం దళిత సాహిత్యంపై పలు రచనలు చేశారు. ఆయన రచనలకు మెచ్చి పలు సంస్థలు అనేక అవార్డులతో సత్కరించాయి. కవిచంద్రగా పేరు తెచ్చుకున్న మద్దా సత్యనారాయణకు ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన 36వ జాతీయ మహాసభలో దళిత సాహిత్య అకాడమీ అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అందజేసింది.
మద్దా సత్యనారాయణ మృతి పట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి
ఢిల్లీ నుంచి బుధవారం ఉదయం సత్యనారాయణ గురజనాపల్లి చేరుకున్నారు. అదే రోజు సాయంత్రం ఇంట్లో కుటుంబ కలహాలు చోటు చేసుకున్నాయి. దీంతో మనస్తాపం చెందిన మద్దా సత్యనారాయణ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. మద్దా మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇలాంటి మంచి వ్యక్తి ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం తమకు ఎంతగానో బాధగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు సాహితీప్రియులు, కవులు, రచయితలు, దళిత సంఘాల నేతలు మద్దా మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు.