వైఎస్ జగన్కు మమత బెనర్జీ లేఖ: ఆహ్వానించినా..దూరంగా
అమరావతి: ప్రస్తుతం దేశ రాజకీయాలన్నీ రాష్ట్రపతి ఎన్నికల చుట్టూ తిరుగుతోన్నాయి. భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రకటించిన అభ్యర్థిని విజయాన్ని అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకం అయ్యాయి.. జట్టు కట్టాయి. శతృవుకు శతృవు మిత్రుడైనట్టు- అనే ఫార్ములాను అనుసరిస్తోన్నాయి. రాజకీయంగా తమ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ- రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ నిలబెట్టే అభ్యర్థి గెలుపును అడ్డుకుని..తమ సత్తా చాటే దిశగా పావులు కదుపుతున్నాయి.

ప్రతిపక్ష పార్టీలివే..
జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే బాధ్యతను తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీసుకున్నారు. ఆయా పార్టీల నేతలో దేశ రాజధానిలో సమావేశాన్ని నిర్వహించారు. సీపీఐ, సీపీఎం సీపీఐఎంఎల్, రివాల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్వాది పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, జనతాదళ్ (సెక్యులర్), డీఎంకే, రాష్ట్రీయ లోక్దళ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, జార్ఖండ్ ముక్తి మోర్చా నేతలు దీనికి హాజరయ్యారు.

వైసీపీ సహా..
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న యూపీఏ కూటములకు సమదూరాన్ని పాటిస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, బిజూ జనతాదళ్ నాయకులకు కూడా ఆహ్వానం అందినప్పటికీ.. వారు గైర్హాజయ్యారు. మమత బెనర్జీ నిర్వహించిన ప్రతిపక్ష నాయకుల సమావేశానికి దూరంగా ఉన్నారు. అలాగనీ బీజేపీ నిలబెట్టే రాష్ట్రపతి అభ్యర్థికి తాము మద్దతు ఇస్తామని బహిరంగంగానూ ఎక్కడా ప్రకటించట్లేదా పార్టీల నేతలు.
నాలుగో అతిపెద్ద పార్టీగా..
ఈ అంశం.. ఇప్పుడు కీలకంగా మారింది. దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీ వైఎస్ఆర్సీపీ. బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తరువాత.. ఆ స్థాయిలో ఎంపీల సంఖ్య ఉన్నది ఒక్క వైసీపీకి మాత్రమే. అలాంటి పార్టీ ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక వ్యవహారంలో అత్యంత కీలక పాత్ర పోషించనుంది. అందుకే మమత బెనర్జీ- స్వయంగా వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు.

ఫరూక్ అబ్దుల్లా పేరు..
వైఎస్ జగన్ తన వైఖరిని వెల్లడించలేదు.. గానీ మమత బెనర్జీ నిర్వహించిన సమావేశానికి దూరంగా ఉన్నారు. దీనితో జాతీయ రాజకీయాల్లో తటస్థంగా ఉంటున్నాననే అంశాన్ని ఆయన మరోసారి పరోక్షంగా స్పష్టం చేసినట్టయింది. మరోవంక- రాష్ట్రపతి అభ్యర్థి కోసం ప్రతిపక్షాల తరఫు నుంచి తొలుత కేంద్ర మాజీమంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు వినిపించినప్పటికీ.. ఆయన తప్పుకొన్నారు. తాను ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీనితో నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, జాతిపిత మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పేర్లు వెలుగులోకి వచ్చాయి.












Click it and Unblock the Notifications