నిడదవోలులో ఘోరం: ఆలయంలోనే పూజారి శివనాగేశ్వరరావు దారుణ హత్య
పశ్చిమగోదావరి: జిల్లాలోని నిడదవోలు మండలం తాడిమళ్లలో దారుణ ఘటన చోటు చసుకుంది. తాడిమళ్ల గ్రామంలోని శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న కొత్తలంక శివనాగేశ్వరరావును గుర్తుతెలియని వ్యక్తులు గుడిలోపలే హత్య చేశారు. అర్ధరాత్రి అయినప్పటికీ భర్త ఇంటికి రాకపోవడంతో.. కుటుంబసభ్యులకు పూజారి భార్య సమాచారం అందించారు.
ఈ క్రమంలో పూజారి ఆచూకీ కోసం రాత్రి ఆలయం వద్దకు వెళ్లిన కుటుంబసభ్యులు.. బయట ఆయన వాహనం కనిపించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. పూజారికి సంబంధించిన పొలం వద్ద కూడా లేకపోవడంతో.. పని మీద వేరొక ఊరికి వెళ్లి ఊంటారని భావించారు.
తెల్లవారుజామున పూజారి కోసం గాలించిన కుటుంబసభ్యులకు.. ఆలయ ఆవరణలోనే రక్తపు మడుగులు ఆయన మృతదేహం కనిపించింది. దీంతో పూజారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
ఈ నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పూజారికి వేరే వారితో ఏమైనా గొడవలు ఉన్నాయా..? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో పరువు హత్య
ఏపీలోని అనంతపురం జిల్లాలో పరువుహత్య కలకలం రేపింది. పరువు కోసం దారుణానికి తెగబడ్డారు యువతి బంధువులు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లికి చెందిన యువకుడు గొల్ల నరేంద్ర.. అదే గ్రామంలోని బోయ సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడు. వారి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోడంతో.. వారిని ఎదిరించి రెండేళ్ల కిందట పెళ్లి చేసుకుని కోనేపల్లిలో నివాసం ఉంటున్నారు. వారికి ఒక కుమార్తె కూడా ఉంది..
అయితే, కులాంతర వివాహం చేసుకున్న నరేంద్రపై కక్ష గట్టిన యువతి బంధువులు అవకాశం కోసం ఎదురుచూశారు.. రెండేళ్లు గడవడంతో నరేంద్ర అంతా సర్దుకుందని భావించాడు. ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత తొలిసారి వెంకటాంపల్లికి వెళ్లాడు నరేంద్ర.. అక్కడ, ట్రాక్టర్ రిపేర్ చేస్తుండగా నరేంద్రపై దాడి చేసి, వేట కొడవళ్లతో నరికి చంపారు యువతి బంధువులు. ఇక, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.