కలెక్టర్ సంచలన నిర్ణయం:సమస్యలు పరిష్కరించని అధికారులకు ఫైన్
పశ్చిమ గోదావరి:ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన నిర్లక్ష్యాన్ని, అవినీతిని వదిలించేందుకు ఈ జిల్లా కలెక్టర్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణీత కాల వ్యవధిలో ప్రజా సమస్యలు పరిష్కరించని ఆయా శాఖల అధికారులకు జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాదు ఆ రకంగా జిల్లాలో కొన్ని శాఖల్లో సకాలంలో పూర్తి కాని పనులకు సంబంధించి వివిధ శాఖల అధికారులకు ఫైన్ వేసేశారు. మరికొందరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇంకొందరిని ఏకంగా మాతృశాఖకు సరెండర్ చేశారు. కలెక్టర్ ఒక్కసారిగా కొరడా ఝలిపించడం ప్రభుత్వ ఉద్యోగుల్లో కలకలం రేపింది.
ఇంతకీ ఈ నిర్ణయాన్ని అమలు చేసి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ఎవరంటే?...పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్...వివరాల్లోకి వెళితే

కలెక్టర్...సంచలన నిర్ణయం
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో జిల్లా స్థాయి అధికారుల సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని కలెక్టర్ భాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ప్రజలు అందించిన వినతి పత్రాలను ఆయా ప్రభుత్వ శాఖల సిబ్బంది నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించాలని ఆదేశించారు. నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కారం కాని ఒకొక్క ఫిర్యాదుకు రూ.100 చొప్పున జరిమానా విధిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. దీంతో ఆ సమావేశంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

చెప్పడమే కాదు...అమలు కూడా...
నిర్ణయం ప్రకటించడమే కాదు గతంలో చెప్పిన విధంగా సకాలంలో పనులు పూర్తి చేయని వివిధ ప్రభుత్వ శాఖలకు కలెక్టర్ ఫైన్ విధించారు. ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ పరిధిలో సకాలంలో పరిష్కారం కాని 34 ఫిర్యాదులకు సంబంధించి రూ.3,400, సర్వే సెటిల్మెంట్ శాఖలో 19 ఫిర్యాదులకు రూ.1,900, పౌరసరఫరాల శాఖకు రూ.1,600, మత్స్య శాఖకు రూ.1,000, పంచాయతీ కార్యదర్శులకు రూ.600, దేవాదాయశాఖకు రూ.700 జరిమానా విధిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

క్రమశిక్షణా...చర్యలు కూడా...
మీకోసం కార్యక్రమంలో వచ్చిన ప్రజాసమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్క్ఫెడ్ డీఎం నాగమల్లికకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని డీఆర్ఓను కలెక్టర్ ఆదేశించారు. ఆర్టీసీ డీఎం, మార్క్ఫెడ్ డీఎం, జిల్లా గ్రంథాలయ సంస్థ, ఏపీఐఐసీ శాఖల ఉన్నతాధికారులకు ఈ-ఫైలింగ్ అమలు చేయని కారణంగా షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఆర్ఓ సత్యనారాయణను కలెక్టర్ ఆదేశించడం జరిగింది. అలాగే పశుసంవర్ధకశాఖ జేడీని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

టీచర్లపై చర్యలు...కలకలం
పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయులంతా బాధ్యతగా పాఠాలు చెబితే పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మిగతా జిల్లాల కంటే వెనుకబాటు ఎందుకు వచ్చిందని, దీనికి ఏయే టీచర్ బాధ్యులో గుర్తించాలని డీఈఓ రేణుకను కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఒక్కసారిగా క్రమశిక్షణా చర్యలకు ఆదేశించడం ప్రభుత్వ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications