వీరవాసరం పోలీసుల అదుపులో సైకో సూదిగాడు?: రహస్యంగా విచారణ
హైదరాబాద్: ముఖానికి నల్లని ముసుగు వేసుకుని సూది పోట్లతో పశ్చిమ గోదావరి జిల్లాలో జనం మీద కనుకు లేకుండా చేసిన సైకోను వీరవాసరం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓ రహస్య ప్రాంతానికి తరలించి సైకో సూదిగాడిని పోలీసులు విచారిస్తున్నారు.
ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. ఇందులో ఒకరు పోలీసులు విడుదల చేసిన ఉహాచిత్రానికి దగ్గరగా ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విచారణలో జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు, ఎస్పీ, డీఎస్పీలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
నిన్న మధ్యాహ్నాం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలాంటి సిరంజీ దాడులు జరగలేదు. దీంతో పట్టుకున్న ఇద్దరిలో ఒకరు సైకో సూదిగాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు విడుదల చేసిన ఊహాచిత్రం, స్ధానికంగా ఉన్న పెట్రోల్ బంక్ యజమానులు, ఆటో డ్రైవర్లతో పాటు సెల్ ఫోన్ డేటా ఆధారంగా సిరంజి సూదిగాడిని అదుపులోకి తీసుకున్నారు.
సిరంజి సైకోని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పశ్చిమ గోదావరి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న సిరంజి సైకో కోసం పోలీసులు వేట ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. సైకోను పట్టుకునేందుకు పోలీసు శాఖ 44 బృందాలతో పాటు 15 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
గత నెల 22వ తేదీన నుంచి సిరంజి సైకో దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సైకో దాడుల్లో ఇప్పటివరకు 18 మంది గాయపడ్డారు. ఒంటరిగా కనిపించే ఆడ పిల్లలు, మహిళలపై సూది దాడి చేసి పరారవుతున్న సైకో దాడులతో పశ్చిమగోదావరి జిల్లా సహా పరిసర జిల్లాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైన సంగతి తెలిసిందే.
సైకోను అరెస్ట్ చేసేందుకు పక్కా ప్రణాళికను రూపొందించిన పోలీసులు జిల్లావ్యాప్తంగా 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా పట్టువదలి విక్రమార్కుల్లాగా భీమవరం, తణుకు, పాలకొల్లుల్లో పోలీసులు ప్రతి ఇంటికి తిరుగుతూ సైకో కోసం జల్లెడ పట్టారు.
సిరంజి సైకో జాడ తెలిపిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష రూపాయల బహుమతిని నజరాగా ప్రకటించింది. జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ మాత్రం 26వ తేదీ నుంచి ఇప్పటి దాకా ఎలాంటి దాడులు జరగలేదని సోమవారం భీమవరంలో ప్రకటించారు.