నంద్యాల టగ్ ఆఫ్ వార్?: అర్బన్-రూరల్లో ఎవరెంత.. మలుపు తిప్పేవి ఇవే!
నంద్యాల ఉపఎన్నిక ప్రశాంతంగానే ముగిసింది కానీ ఫలితాలు వెల్లడయ్యేదాకా నేతలు ప్రశాంతంగా నిద్రపోవడం కష్టమనే చెప్పాలి.
కర్నూలు: నంద్యాల ఉపఎన్నిక ప్రశాంతంగానే ముగిసింది కానీ ఫలితాలు వెల్లడయ్యేదాకా నేతలు ప్రశాంతంగా నిద్రపోవడం కష్టమనే చెప్పాలి. హీట్ పెంచిన ప్రచారాలు, మాటల యుద్దాలు, సవాళ్లు.. ఇలా ప్రతీది గమనించిన జనం చివరికి ఎవరి వైపు నిలబడ్డారన్నది ఈ నెల 28న తేలిపోనుంది.
వైసీపీకి చిక్కక టీడీపీలోకి: డిసైడ్ చేసేది ముస్లింలే.. ఇదీ నంద్యాల 'రియాలిటీ'?
గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ కూడా పెరగడం ఎవరికీ లాభిస్తుందనేది ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోన్న అంశం. దాదాపు 11శాతం పోలింగ్ పెరగడంతో.. ఈ ఓట్లన్ని ఎవరి ఖాతాలోకి వెళ్తాయన్న దానిపైనే ఫలితం ఆధారపడి ఉంది. దీనిపై అర్బన్-రూరల్ ప్రాంతాల్లో జరుగుతున్న చర్చ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అర్బన్లో ఓటర్ల మనోగతం:
నంద్యాల నియోజకవర్గంలో ఎక్కువమంది ఓటర్లు అర్బన్ ప్రాంతంలోనే ఉన్నారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో 67.2((129486) శాతం జనాభా ఉండటంతో.. ఉపఎన్నిక ఫలితాల్లో వీరి ఓట్లు కీలకంగా మారనున్నాయి. అయితే ఈ దఫా గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెరగడం దీనిపై ప్రభావం చూపనుంది. పట్టణ ప్రాంత ఓటర్లు, గ్రామీణ ఓటర్లు ఒకేవైపు నిలబడితే.. గెలిచే అభ్యర్థికి భారీ మెజారిటీ రావడం ఖాయం. ఒకవేళ అర్బన్-రూరల్ వర్గాలు స్పష్టంగా చీలిపోయినట్లయితే గెలిచే అభ్యర్థికి స్వల్ప మెజారీటి మాత్రమే దక్కుతుంది.
Recommended Video
పోలింగ్ పెరగడం ఎవరికి లాభం:
నంద్యాల మండలానికి చెందిన చుట్టు పక్కల గ్రామాల్లో 20.5శాతం(44960) మంది జనాభా ఉండగా.. గోస్పాడు మండలంలో 12.3(26671)శాతం జనాభా ఉన్నారు. ఈ దఫా పెరిగిన పోలింగ్ శాతంలో వీరే క్రియాశీలకంగా వ్యవహరించారన్న ఊహాగానాలు ఉన్నాయి. అర్బన్లో పోలింగ్ శాతం పెరిగి ఉంటే తమకు మరింత లాభించేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీన్నిబట్టి రూరల్ ప్రాంతాల్లో వైసీపీకి పట్టు లభించే అవకాశం ఉందనుకోవచ్చు. ఒకవిధంగా అర్బన్లో టీడీపీ, రూరల్లో వైసీపీ ఎక్కువ ఓట్లు పొందుతాయని పరిశీలకులు చెబుతున్నారు.
అదే కీ ఫ్యాక్టర్:
ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు ప్రధానంగా సంధించిన అస్త్రం అభివృద్ది. ఎన్నికలవేళ టీడీపీ హడావుడిగా అభివృద్ది పనులు మొదలుపెట్టడంతో.. అధికార పార్టీ గెలిస్తేనే ఆ పనులు పూర్తవుతాయని కొంతమంది ప్రజలు భావిస్తున్నారు. ఈ ప్రభావం ఎన్నికపై పడితే అది టీడీపీ గెలుపుకు దోహదపడుతుంది.
అలా కాకుండా.. టీడీపీ మూడేళ్ల పాలనలో నంద్యాల ప్రజలు విసుగెత్తిపోయి ఉంటే గనుక ఫలితం ప్రత్యర్థికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. జనం నేతలను చూసి ఓటేస్తారో.. లేక పార్టీలను చూసి ఓటేస్తారో తెలియదు కానీ మొత్తానికి అభివృద్ది అనేది ఇక్కడ కీలక పాత్ర పోషించనుంది.
గతంతో పోలిస్తే..:
గత 2014ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటి చేసిన భూమా నాగిరెడ్డికి 78590ఓట్లు పోల్ అయ్యాయి. వీరంతా ఇప్పటికీ భూమా వెంటే ఉన్నట్లయితే.. నంద్యాలలో ఆ కుటుంబం పట్టు నిలుపుకోగలుగుతుంది. అయితే ఫిరాయింపు రాజకీయాల దృష్ట్యా ఇందులో కొన్ని ఓట్లు కచ్చితంగా చీలిపోయే అవకాశం ఉంది.
ఈ లెక్కన ఒకవేళ భూమా బ్రహ్మానందరెడ్డి గెలిచినా.. గతంతో పోలిస్తే భారీ మెజారిటీ రాకపోవచ్చునన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఇంతకుముందు ఇరు పార్టీల సర్వేల్లో తేలినట్లే.. మెజారిటీ కేవలం 15వేల కాస్త అటు ఇటుగా పరిమితమయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.