అసలు పవన్ టార్గెట్ ఏంటి?: ఆ విషయం గుర్తుంచుకుని మరీ జగన్కు కౌంటర్..
విజయవాడ: రాజకీయాల అంతిమ లక్ష్యం రాజ్యాధికారమే. వ్యవస్థను మార్చాలన్నా.. అసమ విలువలను రూపుమాపాలన్నా.. అంతా అక్కడి నుంచే సాధ్యం. కాబట్టి రాజకీయాల్లోకి వచ్చేవారెవరైనా సరే అధికార పీఠమే లక్ష్యంగా పెట్టుకుంటారు.
Recommended Video

కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రజాసేవకు పదవులు ఎందుకంటూనే రాజకీయంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పరోక్షంగా వైసీపీని దెబ్బకొడుతున్న ఆయన.. ఎక్కువగా జగన్ పైనే విమర్శలు గురిపెడుతున్నారు. తద్వారా ఆయన భవిష్యత్తులో ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నారా? లేక టీడీపీనే ఢీకొట్టడానికి ప్రయత్నిస్తున్నారా? అన్నది గందరగోళంగా మారింది.
తాజాగా విజయవాడలోని ఫాతిమా కాలేజీ విద్యార్థులతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మరోసారి తన రాజకీయాల గురించి మాట్లాడారు.

ప్రతిపక్ష పాత్ర సరిగా లేదు:
విజయవాడ పర్యటనలోను పవన్ ప్రతిపక్ష పార్టీనే ప్రధానంగా టార్గెట్ చేసినట్లు కనిపించింది. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ తన విధిని సరిగా నిర్వర్తిచండంలేదని పవన్ మరోసారి అన్నారు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు, అధికార పక్షం దానిని పరిష్కరించనప్పుడు.. ప్రతిపక్షం వారికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు. ప్రతిపక్షం పనే అది అన్నారు.

ఆ విషయం గుర్తుంచుకుని మరీ!:
తెలుగుదేశం ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీగా వైసీపీ దాన్ని నిలదీసి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని పవన్ అన్నారు. అంతేగానీ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి బట్టలూడదీస్తానంటే పనులు జరగవని జగన్ను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు.
గతంలో నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా జగన్ చంద్రబాబును ఉద్దేశించి.. 'వచ్చేది మా ప్రభుత్వమే.. ఆ తర్వాత చంద్రబాబు చొక్కా విప్పుతాను' అని అప్పట్లో వ్యాఖ్యానించారు. ఆ విషయాన్ని గుర్తు ఉంచుకునే పవన్ ఇప్పుడు కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఎవరి పక్షం కాదు:
తాను ఎవరి పక్షంకాదని, ప్రజల పక్షమని పవన్ కల్యాణ్ అన్నారు. టీడీపీ, బీజేపీలను నిలదీయడానికి తాను భయపడనని చెప్పారు. రాష్ట్ర విభజనతో ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయని, అన్ని పార్టీలు మైండ్ గేమ్ తో చూస్తే సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ఆడపడుచుల శోకాలు దేశానికి, రాష్ట్రానికి మంచిది కాదని అన్నారు. ప్రతిపక్ష పార్టీ వైసీపీ సమస్యలను అసెంబ్లీ సాక్షిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ఫాతిమా కాలేజీ విద్యార్థులను రీ లోకేట్ చేయాలని మరోసారి పవన్ కోరారు.

ఏంటీ పవన్ టార్గెట్:
వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఖాయమైపోయింది. అయితే ఆయన పోటీ చేయడం వల్ల ఎక్కువగా నష్టం జరిగేది వైసీపీకే అనేది నిర్వివాద అంశం. సరే, వైసీపీ సంగతి పక్కనబెడితే పవన్ అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారా? లేక వైసీపీ అవకాశాలను దెబ్బకొట్టడానికే ప్రయత్నిస్తున్నారా? అన్నదానిపై క్లారిటీ లేదు. పవన్ నిజంగానే అధికార పీఠాన్ని గురిపెడితే.. చంద్రబాబుతో ఆయనకెలాంటి లోగుట్టు లేదనే సంకేతాలు వెళ్తాయి. ఇప్పటికైతే అలాంటి సంకేతాలేవి పవన్ నుంచి వెలువడకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications