సీమాంధ్రకు బహుమతి: ఏమిటీ ప్రత్యేక హోదా, లాభం?
కొండ ప్రాంతాలు, ఆవాసానికి కష్టసాధ్యమైన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు, తక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు, దేశ సరిహద్దుల్లో అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన ప్రాంతాలు ఉన్న, విదేశాలతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలకు, ఆర్థికంగా, మౌలిక సదుపాయాల పరంగా, సామాజికంగా బాగా వెనకబడిన రాష్ట్రాలకు ఈ ప్రత్యేక హోదా ప్రకటించే వెసులుబాటు ఉంది.
1969 నాటికి అసోం, జమ్ము-కశ్మీర్, నాగాలాండ్ రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక ప్రతిపత్తి ఉండేది. ప్రస్తుతం పదకొండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. ఆ రాష్ట్రాలు అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము-కాశ్మీర్.
2000 సంవత్సరంలో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసిన ఎన్డీయే సర్కారు ఉత్తరాఖండ్కు ప్రత్యేక హోదా ప్రకటించింది. .ఉత్తరాఖండ్ వేరే దేశం (టిబెట్ )తో సరిహద్దును పంచుకోవడం వల్ల, ఆ రాష్ట్రమంతా పర్వత ప్రాంతమయం కావడం పల్ల ప్రత్యేక హోదా కల్పించింది.
ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వనరుల కేటాయింపులో అత్యధిక వాటా లభిస్తుంది. ఆ రాష్ట్రాలకు పరిశ్రమలు, ఉత్పాదక సంస్థలను తరలించేందుకు, తిరిగి ఏర్పరచేందుకు వీలుగా గణనీయమైన రీతిలో ఎక్సైజ్ సుంకం మినహాయింపులు లభిస్తాయి. దీనివల్ల పారిశ్రామికాభివృద్ధి వేగవంతంగా, ఎక్కువగా జరుగుతుంది. పరిశ్రమలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఉద్యోగావకాశాలు పెరిగి, జీవన ప్రమాణాలు పెరుగుతాయి.
ప్రత్యేక హోదా వల్ల కేంద్రం ప్రణాళికా వ్యయానికి అందించే స్థూల బడ్జెటరీ మద్దతులో 30 శాతం లభిస్తుంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రణాళికా సాయంలో 90 శాతం మేర గ్రాంట్ల రూపంలోనూ మిగతా 10 శాతాన్ని రుణాల రూపేణా అందిస్తారు. మామూలు రాష్ట్రాలకు ఈ వాటా 70-30 శాతంగా ఉంటుంది.
ప్రస్తుతం బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిసా, రాజస్థాన్ ప్రత్యేక ప్రతిపత్తిని కోరుతున్నాయి. బీహార్ వెనకబడి ఉందని, ప్రత్యేక హోదా కల్పించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పదే పదే అంటున్నారు.