పవన్.. ఇప్పుడేం చేస్తారు?: విభజన హామీల సాధనపై నేటితో ముగియనున్న డెడ్లైన్!
అమరావతి: విభజన హామీల సాధన విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పవన్ పెట్టిన డెడ్లైన్ కూడా నేటితో ముగియనుంది.
ఈ నేపథ్యంలో జనసేనాని తదుపరి చర్య ఏమిటి? అన్న విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు విభజన హామీల సాధనకు సంబంధించి ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ కార్యచరణను ప్రకటించాయి. మరి జనసేనాని ఏం చేయబోతున్నారో ఆయనే చెప్పాలి.
నేటితో ముగియనున్న పవన్ గడువు...
రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు, వాటి సాధన, ఏపీకి అందించాల్సిన సాయం... ఇలాంటి విషయాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేసి, అందుకు ఫిబ్రవరి 15 వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గడువు పెట్టారు. ఈ గడువు నేటితో పూర్తి కానుంది. ఇప్పటి వరకు ఇటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంగానీ, అటు రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వంగానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో జనసేనాని తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోందనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తన డిమాండ్పై స్పందించని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పవన్ ఎలా వ్యవహరించనున్నారు?
వైఎస్ జగన్ ముందడుగు...
మరోవైపు ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ విభజన హామీల సాధన విషయంలో ఇప్పటికే తన కార్యాచరణను స్పష్టంగా ప్రకటించింది. ఈ విషయమై మార్చి 5న తమ పార్టీ నేతలు ఢిల్లీలో భారీ ఎత్తున ధర్నా చేయనున్నట్లు వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ ధర్నాలో కమ్యూనిస్టు పార్టీలు కూడా పాల్గొననున్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించకుంటే ఏప్రిల్ 6న తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని కూడా వైఎస్ జగన్ ప్రకటించారు. దీంతో ఈ విషయంలో ఆ పార్టీ ఒకడుగు ముందుకేసినట్లు చెప్పుకుంటున్నారు.
టీడీపీ సంగతేంటి?
విభజన హామీల సాధనకు సంబంధించి ప్రతిపక్ష పార్టీ వైసీపీ స్పష్టమైన ప్రకటన చేయడం ఇటు తెలుగుదేశం పార్టీని కూడా ఇరకాటంలో పడేసింది. దీంతో ఆ పార్టీ కూడా ఈ విషయంలో ఏదో ఒకటి చేయక తప్పని స్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కూడా కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే తీవ్ర నిర్ణయాలు ఉంటాయంటూ హెచ్చరిస్తున్నారు. తమ పార్టీ తరుపున కూడా బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు పార్లమెంటులో ఒత్తిడి పెంచుతూ వేచి చూడాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.
పవన్ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్, కాంగ్రెస్ మాజీ ఏంపీ ఉండవల్లి అరుణ్కుమార్లతో చర్చలు జరిపారు. అలాగే శుక్రవారం ఆయన వామపక్ష నాయకులను, మరోవైపు జేఎస్పీ ప్రతినిధులను కలిసి వారితోనూ చర్చించనున్నారు. ఇంకా రఘువీరారెడ్డి వంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులతోనూ పవన్ మాట్లాడే ప్రయత్నాలూ చేస్తున్నారు. మరి ఈ చర్చల ఉద్దేశం ఏమిటి? పవన్ మదిలో ఏముంది? ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏలా ఉండబోతోంది? కేంద్రంపై ఆయన ఎలా స్పందించబోతున్నారు? అన్నది తీవ్ర ఉత్కంఠ కలిగిస్తోంది.