విభజన: రాజీనామా దిశగా కిరణ్ రెడ్డి యోచన?
హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో మౌనదీక్ష చేపట్టి విభజనకు సహకరించవద్దని, పార్లమెంట్కు బిల్లు పంపించవద్దని రాష్టప్రతిని కోరిన ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఇక భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలనే అంశంపై దృష్టి సారిస్తున్నారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఆయన తన సన్నిహిత మంత్రులతో ఇదే అంశంపై చర్చించినట్లు సమాచారం. క్యాంప్ కార్యాలయంలో కూడా ఆయన ఇదే అంశాన్ని సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో చెప్పాల్సిందంతా చెప్పానని, ఇక ఏమైనా భవిష్యత్తు కార్యాచరణ ఉంటే దానిని హైదరాబాద్ నుంచే కొనసాగించాలని ఆయన భావిస్తున్నారు. ఇందులో రాజీనామా చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై ముఖ్యమంత్రి, ఆయన సన్నిహితులు యోచిస్తున్నారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే రాజీనామా చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నట్లు ఆయన సన్నిహిత మంత్రులు సంకేతాలు ఇస్తున్నారు. బిల్లు పార్లమెంటుకు వెళ్తే రాజీనామా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్కు ఆమోదం పొందాల్సి ఉంది. దీనికోసం ఈ నెల 8వ తేదీ నుంచి గానీ, పది నుంచి గానీ శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఏడో తేదీ రాజ్యసభకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో శాసనసభ్యులు తప్పనిసరిగా భేటీ కావాల్సి ఉంటుంది. అందుకే శనివారం కొనసాగింపుగా ఓట్ ఆన్ అక్కౌంట్ సమావేశాలు ప్రారంభించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. తొమ్మిదిన ఆదివారం కావడంతో పది నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. అదే రోజు రాజ్యసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో పదో తేదీన జరిగే ఓట్ ఆన్ అక్కౌంట్ రోజే తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం కూడా ప్రారంభమైంది.
పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే రాజీనామాపై కూడా ఆలోచిస్తానని ఢిల్లీలో జాతీయ చానళ్లతో మాట్లాడుతూ స్వయంగా ముఖ్యమంత్రి వెల్లడించిన విషయం తెలిసిందే. అందుకే బిల్లు ప్రవేశపెట్టిన రోజే సిఎం రాజీనామా నిర్ణయం కూడా ఉండే అవకాశాలు ఉంటాయన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఇదే సమయంలో ఆయన మంత్రివర్గ సీమాంధ్ర సహచరులు కూడా రాజీనామాలు చేసే పరిస్థితి ఉంటుందని సమాచారం.












Click it and Unblock the Notifications