జగన్ చెప్పిందేంటి ? వైసీపీ నేతలు చేస్తున్నదేంటి ? ప్లీనరీ రిహార్సల్ ప్లాన్ !
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయింది. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. రాజకీయ పరిస్ధితులు సహకరిస్తే ముందస్తు ఎన్నికలు జరిగినా ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ ప్రభుత్వంపై ఫోకస్ పెట్టిన జగన్ ఇక పార్టీపై పట్టు సాధించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన ఎమ్మెల్యేల భేటీలో గడప గడపకూ ప్రభుత్వం, ప్లీనరీల విజయవంతంతో పాటు పలు కార్యక్రమాల్ని జగన్ వారికి అప్పగించారు. అంతవరకూ బాగానే ఉన్నా వీటిలో నేతల వైఖరి ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
Recommended Video
వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో తాజాగా సీఎం జగన్ నిర్వహించిన భేటీల్లో ఈ రెండేళ్లలో పార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ప్రజల్లో ప్రభుత్వ పనితీరును తీసుకెళ్లి ఓట్లు అడగాలని సూచించారు. ఇందుకోసం గడప గడపకూ ప్రభుత్వంతో పాటు ప్లీనరీలు, ఇతరత్రా కార్యక్రమాలు చేపట్టేలా మ్యాప్ రెడీ చేసి ఇచ్చారు. దీంతో వైసీపీ నేతలు వీటిని ప్రారంభించారు. అయితే తొలుత ఈ కార్యక్రమాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు,మంత్రులు చురుగ్గా పాల్గొనడం లేదని గ్రహించిన జగన్.. మధ్యలో రివ్యూ పెట్టి చురకలు అంటించారు. ఆ తర్వాత వైసీపీ నేతల్లో మార్పు కనిపిస్తోంది.
వైసీపీ నేతల్లో స్పష్టమైన మార్పు
వైఎస్ జగన్ గడప గడపకూ ప్రభుత్వంపై ఫీడ్ బ్యాక్ కోసం ఏర్పాటు చేసిన సమీక్ష తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో నోరు విప్పాలంటేనే భయపడి మూడేళ్లు తమ పని తాము చేసుకుపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఇప్పుడు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ప్రత్యర్ధులపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తున్నారు. అంతే కాదు తోటి వైసీపీ నేతలపై కూడా విమర్శలకు దిగుతున్నారు. ఇంకా చెప్పాలంటే వారిని రాజకీయంగా తుడిచి పెట్టే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. దీంతో ఆయన నేతల్ని చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యాఖ్యలు
రాష్ట్రంలో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, వీరికి తోడు టీడీపీ నుంచి అరువు తెచ్చుకున్న మరో నలుగురు, 31 మంది లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు ఇలా భారీ స్ధాయిలో బలగం ఉంది. వీరితో పాటు స్దానిక సంస్ధల్లో, నామినేటెడ్ పదవుల్లో కూడా కలుపుకుంటే వేల సంఖ్యలో వైసీపీ నేతలు ఉన్నారు. వీరంతా ఇప్పుడు రోజుకో రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్న బాలినేని సొంత పార్టీ నేతల కుట్రలపై విమర్శలు చేస్తే, ఆ తర్వాత బొత్స, నారాయణ స్వామి, దాడిశెట్టి రాజా వంటి మంత్రులు కూడా అదే బాట పట్టారు. వీరిని చూసి ఎమ్మెల్యేలు కూడా ఏకంగా జగన్ పైనే గురిపెట్టే స్దాయికి వెళ్లిపోయారు. బటన్లు నొక్కితే జగన్ గ్రాఫ్ పెరుగుతుందే కానీ ఎమ్మెల్యేలది కాదంటూ నిన్న దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
సాయిరెడ్డి బూతు ట్వీట్ల హోరు
వైసీపీలో చాలా మంది నేతలు ఇప్పుడు సొంత పార్టీపై, అధినేత జగన్ పైనా పరోక్షంగా, ప్రత్యక్షంగా విమర్శలకు దిగుతుంటే కీలక పదవిలో ఉంటూ వీరిని కంట్రోల్ చేయాల్సిన ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం ప్రత్యర్ధి టీడీపీ నేతలతో గిల్లి గజ్లాలు పెట్టుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై సాయిరెడ్డి గత మూడేళ్లుగా పెడుతున్న ట్వీట్లు చూసి చూసి విసుగెత్తిన ఇతర నేతలు.. ఇప్పుుడు ఆయనపై అదే భాషలో గురిపెడుతున్నారు. దీంతో మరింత ఫ్రస్ట్రేషన్ తో సాయిరెడ్డి బూతులతో రెచ్చిపోతున్నారు. సాయిరెడ్డి బూతు ట్వీట్లు ఆయన స్ధాయికి ఏమాత్రం తగినట్లుగా లేవని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.
ప్లీనరీ వ్యూహంలో భాగమేనా ?
జూలై 7, 8 తేదీల్లో వైసీపీ రాష్ట్రస్ధాయి ప్లీనరీ జరగబోతోంది. గుంటూరు జిల్లాలో నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా ఉన్న స్ధలంలో దీనికి ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లీనరీకి సన్నాహకంగా రాష్ట్రస్ధాయిలో ప్లీనరీలు నిర్వహిస్తున్నారు. వీటిలో వైసీపీ నేతలు, మంత్రులు తీవ్రంగా రెచ్చిపోతున్నారు. సొంతవారు, పరాయివారు అన్న తేడా లేకుండా విమర్శలు చేస్తూ రాజకీయాన్ని రగిల్చే పనిలో బిజీగా కనిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే వైసీపీ ప్లీనరీకి సన్నాహకంగానే ఈ రాజకీయ వేడిని రగిల్చే వ్యూహాన్ని వైసీపీ అమల్లో పెట్టినట్లే కనిపిస్తోంది. అయితే దీనివల్ల వైసీపీకి ఒనగూడే ప్రయోజనం మాత్రం ఏమీ లేదనేది వాస్తవం.