ముద్దులు పెట్టే వైయస్ జగన్ ఎక్కడ? పక్కనే ఉండి రాలేదు: అడిగిన చంద్రబాబు
శ్రీకాకుళం: తుఫాను సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం చెప్పారు. సాయంత్రంలోగా ఇచ్చాఫురం, కంచిలి, కవిటి, సోంపేటకు కరెంట్ వస్తుందని తెలిపారు. 30వేల విద్యుత్ స్తంభాలు పడిపోవడం వల్లే కరెంట్ సరఫరా ఆలస్యమైందని చెప్పారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలిపారు.
నేలకొరిగిన ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.1200 ఇస్తామని చంద్రబాబు తెలిపారు. జీడితోటల పెంపకానికి ఎకరాకు రూ.40వేలు ఇస్తామన్నారు. సహాయక చర్యలు చేస్తున్న అధికారులను తుఫాన్ బాధితులు అడ్డుకోవద్దని చెప్పారు. తమకు రేషన్ ఇవ్వలేదని చంద్రబాబుకు గరుడభద్ర గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీంతో రేషన్ డీలర్లపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ సరఫరాలో తేడా వస్తే ఊరుకునేది లేదన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు గుప్పించారు. ముద్దులు పెట్టే ప్రతిపక్ష నేత ఎక్కడ అని అడిగారు. పక్క జిల్లాలోనే పాదయాత్ర చేస్తున్నప్పటికీ కనీసం పరామర్శించడానికి రాలేదన్నారు. ప్రజా సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.