అందరిదీ ఒకే వాయిస్, కాంగ్రెస్ రెండు: జివోఎం నిలదీత
న్యూఢిల్లీ: అఖిల పక్ష సమావేశంలో భాగంగా మంత్రుల బృందం (జివోఎం) సమావేశాల్లో మంగళవారం మజ్లిస్, బిజెపి, సిపిఐ, కాంగ్రెసు, టిఆర్ఎస్లు వరుసగా తమ తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ఉదయం మొదటి మూడు పార్టీలు, సాయంత్రం రెండు పార్టీలు జివోఎం భేటీలో పాల్గొన్నాయి.
జివోఎంలో మజ్లిస్ పార్టీ సమైక్య గళం వినిపిస్తూనే విభజన అనివార్యమైతే రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరింది. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని అయితే సీమాంధ్రుల భయాందోళనలు తొలగించాలని బిజెపి, సిపిఐలు కోరగా, కాంగ్రెసు పార్టీ మళ్లీ రెండు స్వరాలు వినిపించింది. తెరాస హైదరాబాదుతో కూడిన పది జిల్లా తెలంగాణ కావాలని కోరింది.
మజ్లిస్ సమైక్యం కానీ
విభజనకు వ్యతిరేకం. విభజన అనివార్యమైతే అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలి. హైకోర్టును విభజించాలి. హైదరాబాద్ పైన కేంద్రం పెత్తనం వద్దు. హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా, కేంద్రపాలిత ప్రాంతంగా ఒప్పుకోం. తెలంగాణలో సీమాంధ్రుల భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదు. కేంద్రమంత్రులు అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతల దృష్టి ముఖ్యమంత్రి పదవి పైన తప్ప తెలంగాణ కోసం కాదు.
హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేసే విషయమై, ఆంటోని కమిటీ నివేదిక పైన అసదుద్దీన్ జివోఎం సభ్యులను నిలదీశారు. మజ్లిస్ నుండి జివోఎం ముందు అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు.
బిజెపి తెలంగాణం
తెలంగాణకు అనుకూలం. అంతుముందు సీమాంధ్ర సమస్యలను పరిష్కరించేందుకు ఏం చేస్తారో చెప్పాలి. వారి భయాందోళనకు పరిష్కారం చూపాలి. అన్నింటికంటే ముందు విభజనపై కాంగ్రెసు వైఖరి స్పష్టం చేయాలి. ఆ పార్టీలోనే విభజన పైన స్పష్టత లేదు. ఒక్కో నేత ఒక్కోలా మాట్లాడుతారు. పదకొండు అంశాల పైన కేంద్రం ఏం చేస్తుందో చెప్పాలి. మీరేం సూచిస్తారని షిండే అడగ్గా తమ వద్ద లేవని బిజెపి చెప్పింది. అయితే తాము బిల్లులో వాటిని పొందుపర్చుతామని షిండే చెప్పారు. బిజెపి గతంలో మూడు రాష్ట్రాలను శాంతియుతంగా ఇచ్చింది అదే విధంగా ఇప్పుడు తెలంగాణ ఇవ్వాలి.
కాంగ్రెసు వైఖరి ఏమిటో చెప్పాలని బిజెపి నిలదీసింది. బిజెపి నుండి కిషన్ రెడ్డి, హరిబాబులు హాజరయ్యారు.
సిపిఐ తెలంగాణం
హైదరాబాదుతో కూడిన పది జిల్లా తెలంగాణను ఏర్పాటు చేయాలి. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క పార్టీని పిలవడం కాకుండా అన్ని పార్టీలను ఒకేసారి అడగాలి. ఆంధ్రా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేయాలి. సీమాంధ్ర ప్రజల భయాందోళనలు తగ్గించడంతో పాటు ప్యాకేజీ ఇవ్వాలి.
విడివిడిగా పార్టీలతో సమావేశం కావడంపై సిపిఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. సిపిఐ నుండి నారాయణ, విల్సన్లు హాజరయ్యారు.
కాంగ్రెస్ విడివిడి నివేదికలు
కాంగ్రెసు పార్టీ నుండి దామోదర రాజనర్సింహ, వట్టి వసంత్ కుమార్లు జివోఎంకు హాజరై విడివిడి నివేదికలు ఇచ్చారు.
పది జిల్లాలతో కూడిన హైదరాబాద్ ఇవ్వాలి. ఉమ్మడి రాజధానిని హైదరాబాదు రెవెన్యూ జిల్లాకే పరిమితం చేయాలి. భద్రాచలం తెలంగాణలోనే ఉండాలి. గోదావరి పైన రెగ్యురేటరీ అథారిటీ అవసరం లేదు. ఆంధ్రా ప్రాంతానికి అవసరమైన ప్యాకేజీని ఇవ్వాలి. ఉద్యోగుల విషయంలో 371 డిని కొనసాగించాలి. - ఇది దామోదర నివేదిక.
విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. విభజనతో రెండు ప్రాంతాలకు నష్టం. జల వనరుల పంపిణీ అసాధ్యమని, ఏ కమిటీ, ఏ కమిషన్ కూడా నీటి పంపిణీని పర్యవేక్షించలేవు. హైదరాబాదు చుట్టు పక్కల అనేక సమస్యలు. ఇది వట్టి వసంత్ నివేదిక.
ఇతర రాష్ట్రాలతో సమానంగా తెరాస
దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు ఎలాంటి అధికారులు ఉన్నాయో తెలంగాణకు అవే ఉండాలి. ప్రత్యేక ఆంక్షలు ఏవీ ఉండవద్దు. హైదరాబాదును ఐదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలి. ఆంక్షలు లేని తెలంగాణను ప్రజలు కోరుకుంటున్నారు. తెరాస తరఫున కెసిఆర్, కె కేశవ రావు జివోఎం భేటీకి హాజరయ్యారు.