సీఎం జగన్ రూటే సపరేటు: ఆ అధికారికి కీలక పోస్టు: తన కారణంగా ఇబ్బందులు పడటంతో...!
అమరావతి: ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి ఎవరు. ముఖ్యమంత్రి జగన్ ఎవరికి అవకాశం ఇవ్వనున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఎల్వీ సుబ్రమణ్యం ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆ తరువాత ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్ సీఎస్ గా ఎల్వీనే కొనసాగించారు. కొద్ది కాలానికే ఎల్వీని ప్రత్యేక కారణాలతో బదిలీ చేసి..ఆయన స్థానంలో కేంద్ర సర్వీసుల్లో ఉన్న నీలం సాహ్నిని నూతన సీఎస్ గా నియమించారు. ఈ జూన్ నెలాఖరున నీలం సాహ్ని పదవీ విరమణ చేయనున్నారు.
మరో మూడు నెలల పాటు నీలం సాహ్నినే కొనసాగించేందుక సీఎంకు అవకాశం ఉంది. అయితే, పూర్తి స్థాయి సీఎస్ ను నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని కోసం ప్రధానంగా ముగ్గురు పేర్లు రేసులో ఉన్నాయి. వారి నేపథ్యం పరిశీలిస్తే వారిలో ఒకరి వైపు సీఎం ఆసక్తిగ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీంతో..ఇప్పుడు ఏపీకి కాబోయే కొత్త సీఎస్ ఎవరనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ముగ్గురు మధ్య ప్రధాన పోటీ...
1984 బ్యాచ్ కు చెందిన నీలం సాహ్ని తరువాత సీఎస్ గా పలువురు అధికారులు పోటీలో ఉన్నారు. వారిలో ప్రీతీసూడాన్,ఎ.పి.సహానీ, డాక్టర్ సమీర్శర్మ,ఆర్.సుబ్రహ్మణ్యం, అభయత్రిపాఠీలు కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారు. వీరిలో ఎవరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిపై ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించడం లేదు. దీంతో తరువాత సీనియర్లుగా ఉన్న నలుగురు అధికారుల మధ్య ఇప్పుడు ప్రధాన పోటీ నెలకొని ఉంది. జగన్ ప్రభుత్వం ఎల్వీ సుబ్రమణ్యంను తప్పించి నీలం సాహ్నికి బాధ్యతలు అప్పగించే వరకూ ఆ సమయంలో నీరభ్ కుమార్ ప్రసాద్ ఇన్ ఛార్జ్ సీఎస్ గా పని చేసారు. ఇక, ఇప్పుడు ఆయనతో పాటుగా సతీష్ చంద్ర..జేఎస్వీ ప్రసాద్...అదిత్య నాధ్ దాస్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
సతీష్ చంద్రకు ఛాన్స్ ఉంటుందా..?
ఇక ఈ నలుగురిలో సతీష్ చంద్ర సీనియర్ అధికారి. ఆయన మరో 20 నెలల పాటు సర్వీసులో కొనసాగనున్నారు. కానీ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. చంద్రబాబు మనిషనే కారణంగా ఆయనకు చాలా కాలంగా జగన్ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. కొద్ది రోజుల క్రితమే ఆయనకు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. సతీష్ చంద్ర ముఖ్యమంత్రికి దగ్గరయ్యే ప్రయత్నాలు..సీఎస్ పదవి దక్కించుకొనే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
ఆదిత్యనాధ్ దాస్ కే ఛాన్స్ దక్కేనా..
ఇక, ఇప్పుడు రేసులో ఉన్న వారిలో ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఆదిత్యనాధ్ దాస్ తొలి నుండి జగన్తో దగ్గర గా ఉంటున్నారు. వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన సుదీర్ఘ కాలం ఇరిగేషన్ వ్యవహారాలనే పర్యవేక్షించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత సైతం ఇప్పుడు అదే శాఖ అప్పగించారు. జగన్ పైన నమోదైన కేసుల సమయంలోనూ ఆదిత్యనాధ్ దాస్ పైనా అభియోగాలు నమోదయ్యాయి. అయితే ఆయనకు కొద్ది కాలం క్రితం క్లీన్ చిట్ లభించింది. కానీ, 1986 బ్యాచ్ కు చెందిన సతీష్ చంద్రను ముఖ్యమంత్రి వద్దని భావిస్తే..ఆ తరువాత 1987 బ్యాచ్ కు చెందిన మిగిలిన ముగ్గురు అధికారుల్లో ఆదిత్య నాధ్ దాస్ తొలి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. ఎల్వీ సుబ్రమణ్యం సైతం వైయస్సార్ ప్రభుత్వంలో జరిగిన ఒక వ్యవహారంలో కేసులు ఎదుర్కొన్నారు. ఆయనకు ఎటువంటి ఆలోచన లేకుండా సీఎస్ గా జగన్ ఎంపిక చేయటానికి అది కూడా ఒక కారణంగా ప్రచారం సాగింది.
వారికే సీఎం జగన్ అధిక ప్రాధాన్యత
తన పైన..అధికారుల పైన అక్రమంగా కేసులు బనాయించారనే కారణంగా ..ఇబ్బందులు పడిన అధికారులకు జగన్ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అందులో భాగంగా..ఇప్పుడు కొత్త సీఎస్ గా ఆదిత్య నాధ్ దాస్ కే అవకావం దక్కటం ఖాయమనే ప్రచారం సాగుతోంది. మిగిలిన వారితో న్యాయ పరమైన చిక్కులు లేకుండా..చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోకుంటే తప్ప ఆదిత్య నాధ్ దాస్ ఏపీ నూతన సీఎస్ అయ్యే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఇదే సమయంలో ఢిల్లీ లాబీయింగ్ సైతం కీలకం కానుంది.
Recommended Video