కాబోయే మహిళా హోం మంత్రి ఎవరు? ఉత్తరాంధ్ర వైపు జగన్ మొగ్గు? ఆ ముగ్గురి మధ్యే పోటీ?
అమరావతి: రాష్ట్రంలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడేక్కుతోంది. ఉగాది నుంచి రాష్ట్ర పరిపాలన, సరిహద్దుల రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గం ఒక్కో జిల్లా ఆవిర్భవించనుంది. దీనికి సంబంధించిన కసరత్తును ఇదివరకే పూర్తి చేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.

ఉగాది నుంచి కొత్త రూపురేఖలు
ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అందిన డిమాండ్లు, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ను జారీ చేయడానికి సమాయాత్తమౌతోంది. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ఆరంభమౌతుంది. అదే రోజున కొత్త మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడున్న మంత్రులందరూ ఈ నెల 27వ తేదీన తమ పదవులకు రాజీనామాలు చేయనున్నారు. రాజీనామా చేసిన మంత్రులకు వైఎస్ జగన్- పార్టీపరమైన బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నాయి.

ఎన్నికల టీమ్..
రీజినల్ కమిటీలకు వారిని ఛైర్మన్గానూ నియమిస్తారని తెలుస్తోంది. ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయ వాతావరణం కోలాహలంగా మారింది. మంత్రివర్గంలో బెర్త్ సంపాదించడానికి ఎదురు చూస్తోన్న ఆశావహులు ఇక తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి రాకపోకలు సాగిస్తారనడంలో సందేహాలు అక్కర్లేదు. 2024 నాటి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్ మంత్రివర్గ కూర్పును ఖరారు చేస్తారు.

ముఖ్యమంత్రి తరువాత ఆ స్థాయిలో..
ముఖ్యమంత్రి తరువాత ఆ స్థాయి ప్రాధాన్యత ఉన్న పోర్ట్ ఫోలియో- హోం మంత్రిత్వ శాఖ. ఈ శాఖకు ప్రాతినిథ్యాన్ని వహించే మంత్రిని సాధారణంగా- పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ.. నంబర్-2గా అభివర్ణిస్తుంటారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన ప్రధాన బాధ్యత ఈ శాఖపై ఉంటుంది. ప్రస్తుతం మేకతోటి సుచరిత- ఈ శాఖకు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. మంత్రివర్గ పునర్యవస్థీకరణలో భాగంగా ఆమె తన పదవికి రాజీనామా చేయనున్నారు.

ఆ సామర్థ్యం ఎవరికి ఉంది..?
మరో మహిళా ఎమ్మెల్యేను హోం మంత్రిగా నియమించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో సుచరిత వారసురాలు ఎవరనేది చర్చనీయాంశమౌతోంది. ఆ శాఖను సమర్థవంతంగా ఎవరు నిర్వహించగలుగుతారనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్న మహిళా ఎమ్మెల్యే ఎవరు ఉన్నారనే విషయంపై అటు పార్టీలోనూ డిబేట్కు దారి తీసింది.

ఇప్పుడెవరు ఉన్నారు..
ప్రస్తుతం వైఎస్ జగన్ కేబినెట్లో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, హోం మంత్రి మేకతోటి సుచరిత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఉన్నారు. ఈ ముగ్గురూ తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. మహిళా ఎమ్మెల్యేలు 14 మంది వరకు ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ వైసీపీ నుంచి మహిళా ఎమ్మెల్యేలు గెలుపొందారు. పుష్ప శ్రీవాణి, సుచరిత, తానేటి వనిత పోగా.. మిగిలిన 11 మందిలో ఎవరెవరిని కేబినెట్లోకి తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

ఉత్తరాంధ్ర లేదా రాయలసీమ
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శాసన సభ్యురాలు రెడ్డి శాంతి, పాలకొండ నుంచి విశ్వాసరాయ కళావతి, విశాఖ జిల్లా పాడేరు నుంచి కే భాగ్యలక్ష్మీ ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం నుంచి నాగులపల్లి ధనలక్ష్మీ, గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి విడదల రజిని, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గం నుంచి దాసరి సుధ, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి ఉషాశ్రీచరణ్, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, చిత్తూరు జిల్లా నగరి నుంచి ఆర్కే రోజా, కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి కంగాటి శ్రీదేవి ఉన్నారు.

రెడ్డి శాంతి లేదా రోజాకు
ప్రస్తుతం హోం శాఖను చూస్తోన్న సుచరిత- ముందు నుంచీ పార్టీలో కొనసాగుతున్నారు. అదే తరహాలో ఇప్పుడు కూడా ఆమె వారసురాలిని ఎంపిక చేసే అవకాశం ఉంది. పార్టీలో ముందు నుంచీ పని చేస్తోన్న వారిలో ఆర్కే రోజా, రెడ్డి శాంతి ఉన్నారు. వీరిద్దిరలో ఒకరికి హోం మంత్రి పదవి వరిస్తుందని అంటున్నారు. రోజా- రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే. రెడ్డి శాంతి- వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వారు.

ఎస్సీకి ఇవ్వాలనుకుంటే..
హోం మంత్రిగా కొత్త వారికి, ఎస్సీ సామాజిక వర్గం మహిళకు అవకాశం ఇవ్వాలనుకుంటే శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. చిలకలూరి పేట శాసన సభ్యురాలు విడదల రజిని పేరును పరిశీలనలోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రధానంగా హోం మంత్రి పదవి పోటీ రోజా, రెడ్డి శాంతి, జొన్నలగడ్డ పద్మావతి మధ్యే ఉంటుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications