హోదా: 'ఇంకా అర్థం కాలేదా', 'బాబు ఎందుకు మౌనంగా ఉన్నారు?'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని కేంద్రం చెబితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడటం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ఆదివారం అన్నారు. హోదా రాదని కేంద్రం చెప్పినప్పటికీ టిడిపి ఇంకా పిల్లిమొగ్గలు వేస్తోందన్నారు.
ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమన్నారు. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తన అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు హోదా వస్తుందని చెబుతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబుకు అర్థం కాలేదా: సిపిఎం మధు
ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరి సామాన్య ప్రజలకు అర్థమైనా టిడిపికి అర్థం కాకపోవడం దురదృష్టకరమని సీపీఎం నేత మధు తిరుపతిలో అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్రం ప్రకటించినా చంద్రబాబు మాత్రం ఆ నిబంధన మన రాష్ట్రానికి వర్తించదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రాష్ట్రానికి రాష్ట్రస్థాయి రాజధానిని నిర్మిస్తే సరిపోతుందని అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం అవసరం లేదన్నారు.
చంద్రబాబు మొసలి కన్నీరు: వైయస్సార్ కాంగ్రెస్
ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం విమర్శించింది. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి తిరుపతిలో మాట్లాడారు.
చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొని, కేంద్రమంత్రులతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అబద్దాలని విమర్శించారు.