బాబు యూటర్న్ వెనుక... మీకోసమే 21న అవిశ్వాసం, జైట్లీ అబద్దం చెప్పలేదు: జగన్
Recommended Video

ఒంగోలు: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన కొత్తేమీ కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం చెప్పారు. గతంలో కూడా ఇదే చెప్పారన్నారు. పాత పాడే పాడితే.. చంద్రబాబు ఓవర్గా రియాక్టై యూటర్న్ తీసుకొని కేంద్ర కేబినెట్ నుంచి మంత్రులను ఉపసంహరించుకోవడం హాస్యాస్పదమన్నారు.
జైట్లీ, ఎన్డీయే ప్రభుత్వం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే చెబుతున్నా చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకోవడానికి సార్వత్రిక ఎన్నికలు, హోదాపై ప్రజల నుంచి ఒత్తిడి, తమ పార్టీ రాజీనామాలు చేస్తామనడం, 21న అవిశ్వాసం పెడతామని చెప్పడమే కారణాలు అన్నారు.

చంద్రబాబు యూ టర్న్
అరుణ్ జైట్లీ గతంలో ఇవే మాటలు చెప్పినప్పుడు చంద్రబాబు ఆయన వ్యాఖ్యలను స్వాగతించారని, అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ అభినందించారని, ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని జగన్ చెప్పారు. చంద్రబాబు యూటర్న్ ప్రజల విజయం అన్నారు. ఇప్పుడు కూడా అర్ధరాత్రి ఓవర్ రియాక్టయ్యారన్నారు.

ఎన్డీయేలో కొనసాగడం ఏమిటి
టీడీపీ కేంద్రమంత్రులు రాజీనామా చేయడానికి ముందు ప్రధాని మోడీకి ఫోన్ చేశానని చంద్రబాబు చెబుతున్నారని, అలా చేయడం వెనుక అర్థం ఏమిటని జగన్ ప్రశ్నించారు. కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేసి, ఎన్డీయేలో కొనసాగడం, కన్వీనర్గా కొనసాగడం ఏమిటన్నారు.

21న అవిశ్వాస తీర్మానం, కలిసి వెళ్దాం
చంద్రబాబు నాయుడు పూటకో మాట, రోజుకో వ్యాఖ్య చేస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు. ప్రజల ఆకాంక్షకు చంద్రబాబు తగ్గవలసి వచ్చిందన్నారు. చంద్రబాబుకు తాను ఒకటే చెబుతున్నానని, ఈ నెల 21న అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని, తమకు మద్దతు పలకాలన్నారు.

మీకు సమయం ఇచ్చేందుకే 21న అవిశ్వాసం
తాము 21వ తారీఖున అవిశ్వాసం పెట్టడానికి చంద్రబాబుకు సమయం ఇచ్చేందుకేనని జగన్ చెప్పారు. చంద్రబాబు అవిశ్వాసం పెట్టినా నేను మద్దతిస్తా, నేను అవిశ్వాసం పెట్టినా చంద్రబాబు మద్దతివ్వాలన్నారు. మీకు సమయం ఇచ్చేందుకే అవిశ్వాసం తేదీని 21కి నిర్ణయించామన్నారు.

బీజేపీ అదే చెబుతోంది, చంద్రబాబే ఇలా
14వ ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేక హోదా ఇవ్వవద్దని జైట్లీ ఆ రోజు చెప్పారు, ఈ రోజు కూడా చెప్పారని, కానీ అప్పుడు చంద్రబాబు స్వాగతించి, ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. బీజేపీ చెబుతున్న వ్యాఖ్యల్లో అబద్దాలు ఏమీ లేవని, చంద్రబాబు మాత్రం అవే వ్యాఖ్యలకు రెండు రకాలుగా స్పందించారని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలన్నారు.

14వ ఆర్థిక సంఘం-హోదాపై కేంద్రానికి ప్రశ్న
ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘానికి సంబంధం ఏమిటని జగన్.. కేంద్రాన్ని కూడా నిలదీశారు. తాను అప్పుడు అదే చెప్పానని, ఇప్పుడు అదే చెబుతున్నానని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయకముందే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్లో తీర్మానం చేసిందని, హోదా అమలు చేయాలని పరణాళికా సంఘానికి సిఫార్స్ చేసిందన్నారు. మోడీ ప్రధాని అయ్యాక ఏడు నెలల వరకు ప్లానింగ్ కమిషన్ ఉందని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబుకు హఠాత్తుగా ఇవన్నీ గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు. బాబుకు ఇవన్నీ తెలుసునని చెప్పారు.

ఇరకాటంలో టీడీపీ
చంద్రబాబు ఇప్పటికైనా చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా, చిత్తశుద్ధితో హోదా కోసం పోరాడాలన్నారు. తాము అవిశ్వాస తీర్మానం పెడితే కలిసి రావాలన్నారు. ఎన్నికల సంవత్సరం వస్తుందని డ్రామాలు అన్నారు. 21వ తేదీకి ముందు పెట్టమన్నా మేం సిద్ధమని టీడీపీని ఇరకాటంలో పడేశారు. 25 మంది ఎంపీలం ఒక్కతాటిపై నిలబడదామని చెప్పారు. అప్పుడే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు.












Click it and Unblock the Notifications