సర్వే దెబ్బ, కేసీఆర్ ఎఫెక్ట్: పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబులో మార్పు ఎందుకంటే?
Recommended Video
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులో మార్పు ఎందుకు వచ్చింది? హఠాత్తుగా ఆయన పవన్ తమతో కలవాలని ఎందుకు చెప్పారు? ఇది అందరిలోను తలెత్తుతున్న ప్రశ్న. దీనిపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా 2019 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఆయన మళ్లీ జనసేనానిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేశారని అంటున్నారు. చంద్రబాబు తీరు చూస్తుంటే ఓటమిని ముందే అంగీకరించినట్లుగా ఉందని, టీడీపీ ఓటమి తేలిపోయిందని వైసీపీ నేత మల్లాది విష్ణు ఇటీవల అన్నారు. చంద్రబాబు ఓటమి భయంతో పవన్తో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు జనసేనానిని విమర్శించి, ఇప్పుడు పొత్తుకు పిలవడం ఏమిటన్నారు.
2019 ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం, అభ్యర్థుల విషయంలో చంద్రబాబు-జగన్ కంటే ముందే
రెండు రోజులుగా కన్ఫ్యూజన్
పవన్ కళ్యాణ్, టీడీపీ కలిసి పోటీ చేస్తే తప్పేమిటని, జగన్కు నొప్పి ఎందుకు అని చంద్రబాబు రెండు రోజుల క్రితం ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. అప్పటి నుంచి కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి అన్యాయం చేశారని, తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తున్నామని, జనసేనాని కూడా తమతో కలిసి రావాలని రెండు రోజులుగా కోరుతున్నారు. ఏపీ అభివృద్ధి చెందడం కేసీఆర్, మోడీలకు ఇష్టం లేదని, ప్రధాని చేతిలో జగన్ పావుగా మారారని ఆరోపించారు. చంద్రబాబు మాటలతో పవన్ తిరిగి టీడీపీ వైపు వెళ్తున్నారా అనే చర్చ జోరుగా సాగింది.
చంద్రబాబుకు జనసేనాని గట్టి షాక్
జనసేనపై పలువురు నెటిజన్లు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. నాలుగేళ్లు టీడీపీ పాలనపై మౌనంగా ఉండి, ఆ తర్వాత చంద్రబాబును తిట్టి, మళ్లీ ఇప్పుడు అదే పార్టీ వైపు వెళ్తున్నారనే ప్రచారంపై జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అదే జరిగితే.. అంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం పవన్ చేసిన ప్రకటన జనసైనికులకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చాయి. వచ్చే ఎన్నికల్లో కేవలం వామపక్షాలతో మాత్రమే పొత్తు ఉంటుందని, అధికార (టీడీపీ), ప్రతిపక్ష (వైయస్సార్ కాంగ్రెస్) పార్టీలతో పొత్తు ఉండదని, జనసేన 175 స్థానాల్లో పోటీ చేస్తుందని తేల్చి చెప్పారు. తద్వారా చంద్రబాబు ఆహ్వానానికి జనసేనాని నో చెబుతూ, ఆయనకు గట్టి షాకిచ్చారు. ఇది చంద్రబాబుకు షాకే.
హోదాతో పవన్ కళ్యాణ్ను ఆకర్షించే ప్రయత్నం
ఈ విషయం పక్కన పెడితే, అసలు చంద్రబాబు హఠాత్తుగా అలా మాట్లాడటానికి గల కారణాలపై పలువురు విశ్లేషిస్తున్నారు. వివిధ రకాల కారణాలు ఉండవచ్చునని చెబుతున్నారు. అందుకే జనసేనానిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారేమో అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ను దూరం చేసుకోవడం నష్టం చేస్తుందని టీడీపీ భావిస్తోండవచ్చునని అంటున్నారు. తాము అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. అదే కాంగ్రెస్తో టీడీపీ దోస్తీ కడుతోంది. మరోవైపు పవన్ మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హోదా ఇస్తుందని చెప్పి, ఆయనను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుండవచ్చునని అంటున్నారు.
కేసీఆర్ ఏపీలో జగన్ వైపు ఉంటారా?
చంద్రబాబు బుధవారం చేసిన వ్యాఖ్యలు ఆయన ఇంటెన్షన్ను తెలుపుతున్నాయని అంటున్నారు. ఇన్నాళ్లు మోడీ, కేసీఆర్, జగన్, పవన్ ఒక్కటేనని చెప్పారు. కానీ నిన్న మాత్రం పవన్ను మినహాయించి ముగ్గురు ఒక్కటేనని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఏపీ ఎన్నికల్లో వేలు పెడతానని కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. కేసీఆర్ ఏపీకి వస్తే ఫలితం ఎలా ఉంటుందో కానీ, ఆయన జగన్ వైపు ఉంటారని టీడీపీ నేతలు అనుమానిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీలో మోడీకి జగన్, తెలంగాణలో కేసీఆర్ దగ్గరగా ఉన్నారని, కాబట్టి వారిద్దరు ఒక్కటవుతారని చంద్రబాబు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి తోడు విపక్షాల అవినీతి విమర్శలు, ప్రభుత్వ వ్యతిరేకతల నేపథ్యంలో పవన్ను దరి చేర్చుకోవాలని భావిస్తున్నారా అనే చర్చ సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దూరం అంటున్న జగన్.. కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్లోను కలిసే అవకాశాలను కొట్టి పారేయలేం. జగన్, పవన్ జాతీయ ఫ్రంట్లపై ఏమీ మాట్లాడనప్పటికీ, జగన్ ఎలాగూ ప్రత్యర్థి కాబట్టి, పవన్ పైన టీడీపీ కన్నేసిందని అంటున్నారు.
అక్కడ భారీ దెబ్బ, బాబు సామాజిక వర్గం లెక్క
పవన్ కళ్యాణ్ను చంద్రబాబు ఆహ్వానించడం వెనుక మరో కారణం కూడా ఉండి ఉండవచ్చుననే చర్చ సాగుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ స్థానాలు దక్కించుకున్న పార్టీ అధికారంలోకి వస్తుందనే వాదన మొదటి నుంచి ఉంది. 2014లో పవన్ మద్దతు కారణంగా ఈ జిల్లాల్లో టీడీపీ ఎక్కువ సీట్లు దక్కించుకుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. వచ్చే ఎన్నికల్లో సర్వేలు చేసి అందరికీ టిక్కెట్లు ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారు. అలాగే, చాలా రోజులుగా ఆయన అంతర్గతంగా సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. పవన్ దూరమైతే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో భారీగా దెబ్బ పడి టీడీపీ నష్టపోతుందని తేలి ఉంటుందని అంటున్నారు. ఈ కారణంగానే మళ్లీ పవన్ పాట పాడుతున్నారని చెబుతున్నారు. నిన్నటి వరకు పవన్ను కూడా మోడీకి లంకె పెట్టారు. ఇప్పుడు అలా చెప్పడం లేదు. పవన్ దూరమైతే జగన్కు లాభిస్తుందని, అంతేకాకుండా కేసీఆర్, జగన్లు ఒక్కటిగా ఉంటారనే ఉద్దేశ్యానికి తోడు, తన సర్వేలో జనసేన దూరం జరిగితే నష్టమని తేలడంతో ఇలా మాట్లాడారా అనే చర్చ సాగుతోంది. అయితే పవన్ మాత్రం బాబు బుజ్జగింపులకు తలొగ్గలేదు. తాము వామపక్షాలతో మినహా ప్రధాన, విపక్షాలతో కలిసేది లేదని తేల్చి చెప్పారు.