జగన్పై దాడి తర్వాత అందుకే ఢిల్లీకి చంద్రబాబు: మోపిదేవి, ఆపరేషన్ పెరుగు వడ: కన్నా
అమరావతి: తమ పార్టీ అధినేత వైయస్ జగన్ పైన దాడిని పక్కదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మోపిదేవి వెంకటరమణ ఆదివారం అన్నారు. జగన్ పైన దాడి ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
'భౌతికంగా నిర్మూలించాలనే, జగన్ తెలంగాణ పోలీసులకు ఓకే చెప్పలేదు'
చంద్రబాబు, మంత్రి లోకేష్ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందన్న భయంలో టీడీపీ నేతలు ఉన్నారని చెప్పారు. ఢిల్లీ పర్యటనలతో చంద్రబాబు సాధించింది శూన్యమన్నారు. విపక్షాల సానుభూతి కోసమే చంద్రబాబు ఢిల్లీ పర్యటన అన్నారు.
ఏపీలో ఏదో జరుగుతోందని ఢిల్లీలో నమ్మించేందుకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో జరుగుతోందన్న భ్రమలను ఢిల్లీలో కల్పించేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి జాతీయస్థాయి నేతలను కలిశారని, ఏపీలో ఏదో జరుగుతోందని ఢిల్లీస్థాయిలో నమ్మించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారని మోపిదేవి వెంకటరమణ అన్నారు.
ఆపరేషన్ గరుడకు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా చంద్రబాబుదే
చట్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చుట్టంగా వాడుకుంటున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ వేరుగా అన్నారు. ఆపరేషన్ గరుడకు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ముఖ్యమంత్రేనని ఆరోపించారు. ఆపరేషన్ గరుడ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గరుడపై చర్యలు లేకుంటే పెరుగు వడలు వస్తాయి
లేదంటే ఇలాండి గరుడలు, పెరుగు వడలు చాలా వస్తాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తుమ్మినా కూడా ప్రధాని నరేంద్ర మోడీ కుట్రేనని అనే పరిస్థితి ఉందని కన్నా ఎద్దేవా చేశారు. హెరిటేజ్ ఆస్తులు పెరిగినప్పుడు అగ్రిగోల్డ్ ఆస్తులు ఎలా తగ్గాయో చెప్పాలని నిలదీశారు.
కన్నాపై బుద్ధా వెంకన్న ఆగ్రహం
మరోవైపు, కన్నా లక్ష్మీనారాయణపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణను మించిన ధనవంతులు లేరని చెప్పారు. సిమెంట్ కంపెనీలో పని చేసిన కన్నాకు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. ఇక్కడ బెదిరిస్తే భయపడేవాళ్లు ఎవరూ లేరన్నారు. చంద్రబాబు కోసం తాము చావడానికైనా సిద్ధమని చెప్పారు. రోజుకో పార్టీ మారే కన్నాకు చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు ఉందా అన్నారు. కన్నా మాటలన్నీ పచ్చి అబద్దాలన్నారు.