అమ్మాయిలతో తైతెక్కలు, ర్యాగింగ్ తెచ్చిందే చంద్రబాబు: రిషికేశ్వరి మృతిపై రోజా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రిషికేశ్వరి మృతి విషయమై మాట్లాడుతూ... అసలు ర్యాగింగ్ తీసుకు వచ్చిందే చంద్రబాబు అని విమర్శించారు.
నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పైన కుట్ర చేసి ర్యాగింగ్ చేశారని ఆరోపించారు. ఇలా చంద్రబాబు చేసిన ర్యాగింగ్ రాజకీయాల నుండి విశ్వవిద్యాలయాలకు వెళ్లిందని రోజా ఆగ్రహించారు. రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపల్ బాబురావును ఏ1గా చేర్చాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మహిళలు బయటకు వచ్చే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. వనజాక్షి పైన దాడి, రిషికేశ్వరి ఆత్మహత్యలు బాధాకరమన్నారు. ఎమ్మెల్యేలు, అధికారులు మాట్లాడితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి బెదిరిస్తున్నారన్నారు.
రిషికేశ్వరి మృతి కేసులో ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. ఆమె తల్లిదండ్రులకు చంద్రబాబు అపాయింటుమెంట్ కూడా ఇవ్వలేదన్నారు. పైగా, వాళ్లను కలిసేందుకు వెళ్లిన వివిధ సంఘాల వారిపై లాఠీఛార్జ్ చేయించారని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ దుర్మార్గం అన్నారు.
రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపల్ బాబురావు మొదటి ముద్దాయి అన్నారు. వర్సిటీ వీసి కూడా కారణమే అన్నారు. ప్రిన్సిపల్ అమ్మాయిలతో తైతెక్కలాడుతాడని, అలాంటి వ్యక్తిని వెనుకేసుకు వచ్చే ప్రయత్నం టిడిపి నేతలు చేస్తోన్నట్లుగా కనిపిస్తోందన్నారు.
వనజాక్షి కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని, ఇప్పుడు రిషికేశ్వరి మృతి కేసును కూడా ఆలాగే చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రిషికేశ్వరికి వేధింపుల పైన ముందే ఫిర్యాదు చేసిన వర్సీటీ అధికారులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.
అమ్మాయిలతో డ్యాన్స్ చేసి, దుర్మార్గానికి పాల్పడిన ఇలాంటి ప్రిన్సిపల్ను వదిలేస్తే ఎందరి జీవితాలో చెడిపోతాయన్నారు. ర్యాగింగ్కు ఆద్యుడే చంద్రబాబు అని, ఎన్టీఆర్ను ఆయన ర్యాగింగ్ చేసి హతమార్చారని ఆరోపించారు.
రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకొని 20 రోజులు అయినా చంద్రబాబు ఎందుకు స్పందించలేదన్నారు. రాష్ట్రంలో ఇలాంటి సిఎం, విద్యాశాఖ మంత్రి ఉండటం సిగ్గుచేటు అన్నారు. నాగార్జున వర్సిటీ ప్రిన్సిపల్, వీసీలను అరెస్టు చేయాలన్నారు. ఆగస్టు 6న తాము వర్సిటీలో పర్యటిస్తామన్నారు.
ఛార్జీషీటులో ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి పేరు పెట్టారన్నారు. వర్సిటీ వీసీ, ప్రిన్సిపల్ పేర్లను ఎందుకు చేర్చలేదన్నారు. ప్రిన్సిపల్ అమ్మాయిలతో తైతెక్కలాడుతే ఉమనైజర్ అనడం విడ్డూరమన్నారు. రిషికేశ్వరి కేసులో ప్రిన్సిపల్ను ఎ1గా చేర్చాల్సిందే అన్నారు.
ఆంధ్రజ్యోతిపై ఆగ్రహం
ఆంధ్రజ్యోతి పత్రిక పైన రోజా మండిపడ్డారు. జర్నలిజం దిగజారిపోతోందని చెప్పేందుకు నేటి వార్త నిదర్శనమని చెబుతూ.. రోజా ఓ వార్తను చూపించారు. ఆమె మాట్లాడుతూ... నిన్న జగన్తో భేటీ సమయంలో చర్చించిన అంశాలపైన రాయాలని, అంతేకాదని సంబంధం లేని వార్తలు రాయవద్దని సూచించారు.