మెగాస్టార్ టీం చిక్కిందా..రిలీఫ్ దక్కిందా : ఆన్ లైన్ టిక్కెట్ల వెనుక : బయట పెట్టిన ఏపీ ప్రభుత్వం..!!
కొద్ది రోజులుగా ఏపీలో హాట్ టాపిక్ గా మారిన ఆన్ లైన్ సినిమా టిక్కెట్ల అమ్మకాల పైన ప్రభుత్వం సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చింది. ప్రభుత్వం ఆన్ లైన్ సినిమా టిక్కెట్ల కోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిర్ణయం పైన రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పించాయి. ప్రభుత్వ సినిమా టిక్కెట్ల అమ్మకాలు చేయటం ఏంటంటూ ప్రశ్నించాయి. ఇక, ఈ వ్యవహారం మొత్తం వెనుక జరిగిన పరిణామాలను మంత్రి పేర్ని నాని వివరించారు.
ఆన్ లైన్ టిక్కెట్ల వెనుక అసలు కధ..
సినిమా టిక్కెట్ల ధరల ఆన్ లైన్ విధానం పైన గత ప్రభుత్వాల కాలం నుంచి జరుగుతున్న ప్రయత్నాలను ప్రభుత్వ వెల్లడించింది. తాము ఈ నిర్ణయం అమలు కోసం గతంలో వచ్చిన ప్రతిపాదనలు..ప్రభుత్వ శాఖల లేఖలు పరిశీలించి ఒక అధ్యయన కమిటీ వేసామని మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 13న ఒక సర్క్యులర్ జారీ చేసామని..అందులో ఈ రోజు సమావేం ఏర్పాటు చేసి..ఎలా అమలు చేయాలో చర్చించాలని సూచించామని చెప్పారు. నిర్ణయించిన ధరలకే టిక్కెట్లకు విక్రయం జరుగుతుందని తేల్చి చెప్పారు.
కేంద్రం నుంచి తొలి ప్రతిపాదన
ప్రభుత్వ రూల్స్ కు లోబడి టిక్కెట్లు అమ్మకాలు జరగుతాయన్నారు. ధియేటర్లు లైసెన్స్ పొందిన సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం షో నడవాలని స్పష్టం చేసారు. సినిమా టిక్కెట్ల ధరలనుప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేది తమ లక్ష్యమని మంత్రి నాని వివరించారు. పారదర్శకంగా ప్రజలకు టిక్కెట్లను అందిస్తామని స్పష్టం చేసారు. 2002 లో కేంద్రం అన్ని రాష్ట్రాలకు రాసిన లేఖ ద్వారా మూవీ టిక్కెట్లను ఆన్ లైన్ ద్వారా అమ్మకాలు చేయమని సూచించిందని చెప్పారు. 2003 లోనే నాటి ప్రభుత్వానికి విజయవాడకు చెందిన ఒక సంస్థ తాము ఆన్ లైన్ లో టిక్కెట్ల విక్రయం నిర్వహిస్తామని లేఖ పెట్టుకుందని గుర్తు చేసారు.
పన్నుల ఎగవేత-బ్లాక్ మార్కెట్ కంట్రోల్ కోసం
2005లో హైదరాబాద్ పోలీసు కమిషనర్, అదే ఏడాది అక్టోబర్ లో మున్సిపల్ అధికారులు ఆన్ లైన్ లో టిక్కెట్ల అమ్మకాలకు అనుకూలంగా ప్రభుత్వానికి లేఖలు రాసారని చెప్పారు. 10.03.2006 న నాటి ప్రభుత్వం ఒక గజెట్ ను నోటీఫై చేసిందని..దీని మేరకు ఏపీ సినిమా రెగ్యులేషన్ ప్రకారం ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకానికి నిర్ణయం తీసుకుందని మంత్రి చెప్పుకొచ్చారు. ఇక, 16.12.2014 వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అప్పటి ప్రభుత్వానికి ఇదే అంశం పైన ఒక లేఖ రాసారని..ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకాల ద్వారా పన్నుల ఎగవేత కంట్రోల్ చేయవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారని మంత్రి చెప్పారు.
చిరంజీవి అండ్ టీం కోరటంతోనే నిర్ణయం
బ్లాక్ మార్కెట్ అరికట్టవచ్చని రాసారని వివరించారు. 2017లో ఇదే అంశం పైన నాటి ప్రభుత్వం సీఎస్ అధ్యక్షతన ఒక కమిటీ సైతం వేసిందని చెప్పారు. ఇక, ఇదే అంశంలో తమ నిర్ణయం వెనుక అసలు విషయాన్ని మంత్రి పేర్ని నాని వివరించారు. ముఖ్యమంత్రి జగన్ తో జూన్ మాసంలో సినీ పరిశ్రమ ప్రతినిధులు చిరంజీవి.. నాగార్జున..రాజమౌళి వచ్చారని గుర్తు చేసారు. ఆ సమయంలో సినీ పరిశ్రమకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం నుంచి అమలు చేయమని కోరారని..అందులో సినిమా టిక్కెట్లు ఆన్ లైన్ లో అమ్మమని కోరారంటూ అసలు విషయం బయట పెట్టారు.
బయట పెట్టని చిరంజీవి అండ్ టీం
వారు కోరిన అంశాలను చాలా వరకు పరిష్కరించామని..ఈ అంశం పైన కమిటీ వేసామని మంత్రి వెల్లడించారు. అయితే, ప్రభుత్వంతో చర్చల తరువాత...ఇప్పుడు సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ నిర్ణయం తరువాతా టాలీవుడ్ ప్రముఖులు ఎవరూ ఈ విషయం బయటకు చెప్పలేదు. ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు ఇదే అంశం పైన విమర్శలు చేస్తున్నా..తాము కోరటంతోనే ప్రభుత్వం ముందుకు వచ్చిందనే విషయాన్ని చిరంజీవి అండ్ టీం బయటకు వెల్లడించ లేదు.
చిరంజీవి స్పందిస్తారా..అందరి అభిప్రాయం ఇదేనా
దీంతో..ఇప్పటి వరకు నిరీక్షించిన ప్రభుత్వం ఒకే సారి ఈ నిర్ణయం వెనుక చోటు చేసుకున్న అంశాలను బయటకు తీసుకొచ్చింది. దీని ద్వారా చిరంజీవి అండ్ కో సినీ పరిశ్రమ మొత్తం అభిప్రాయం మేరకే ఈ ప్రతిపాదన ప్రభుత్వానికి నివేదించారా..లేక, పక్కా వ్యూహంతో మాత్రమే వ్యవహరించారా అనేది ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్ పైన చిరంజీవి టీం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.