"బాబును ఎందుకు అరెస్టు చేయరు?, దినకరన్ లాగే ఓటుకు నోటులో లంచం"
ఈసీకి లంచం ఇవ్వజూశారన్న కారణాలతో దినకరన్ ను అరెస్టు చేసినప్పుడు.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును మాత్రం ఎందుకు అరెస్టు చేయరని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో శశికళకు శిక్షపడటాన్ని ఉదహరిస్తూ.. టీడీపీ నేతలు ఇన్నాళ్లు జగన్ ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. జయలలిత అక్రమాస్తుల కేసులో ఏ2నిందితురాలిగా ఉన్న శశికళకే నాలుగేళ్ల జైలు శిక్ష పడితే.. ఇక జగన్ కు ఎన్నేళ్లు శిక్ష పడాలని వారు ఎద్దేవా చేశారు.
అయితే వైసీపీకి సైతం ఇప్పుడా ఆరోపణలను తిప్పికొట్టే అవకాశం వచ్చింది. దినకరన్ అరెస్టును ఉదహరిస్తూ చంద్రబాబును మాత్రం ఎందుకు అరెస్టు చేయరని వైసీపీ ప్రశ్నిస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
ఈసీకి లంచం ఇవ్వజూశారన్న కారణాలతో దినకరన్ ను అరెస్టు చేసినప్పుడు.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును మాత్రం ఎందుకు అరెస్టు చేయరని ఆయన ప్రశ్నించారు. భావనపాడు పోర్టు గురించి ప్రస్తావిస్తూ.. ఏపీలో మరో దోపిడీకి అధికార పార్టీ తెరదీస్తోందని ఆరోపించారు. ఈ పోర్టుకు గ్లోబల్ టెండర్లు ఎందుకు పిలవలేదని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.

పోర్టు ఆదాయంలో 2.3శాతం ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి జరిగిన ఒప్పందాల వెనుక ఎలాంటి లొసుగులున్నాయో బయటపెట్టాలని బొత్స డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో డబ్బు సంచులు మోసినవారికి నామినేషనర్ పద్దతిలో కాంట్రాక్టులు కేటాయిస్తున్నారని మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న దోపిడీయే భావనపాడులో కూడా జరుగుతుందని బొత్స ఆరోపించారు. కిరీటాలు ఉత్తరాంధ్రకు పెట్టడం కాదని, ఆయన కుటుంబానికే అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇకనైనా అబద్దాలు మానుకోవాలని, ఇసుక దోపిడీని అడ్డుకుని ఉంటే చిత్తూరు జిల్లా ఏర్పేడులో ప్రమాదం జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications