నిమ్మగడ్డ హయంలో ఎన్నికలు- సర్కారు భయం అదేనా ?- స్ధానిక పోరు మొదలైతే కష్టమే..
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో దాదాపు ఏడాదిగా ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య ఎడతెగని పోరు కొనసాగుతోంది. కరోనా ప్రబావం మొదలుకాగానే ఎన్నికలను వాయిదా వేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్పై ఏకంగా సీఎం జగన్.. కులం పేరుతో దాడి మొదలుపెట్టగా.. ఆ తర్వాత ప్రభుత్వంలో వారంతా దాన్ని అందుకున్నారు.
కరోనా తగ్గిందని మళ్లీ ఎన్నికలు పెట్టాలని నిమ్మగడ్డ నిర్ణయించుకోగానే అదే స్ధాయిలో మళ్లీ దాడి మొదలైంది. అది ఇప్పటికే కోర్టుల వరకూ వెళ్లి కొనసాగుతూనే ఉంది. అయితే స్ధానిక పోరును ఎదుర్కొనే విషయంలో సంఖ్యాపరంగా దుర్భేధ్యంగా కనిపిస్తున్న జగన్ సర్కార్ నిమ్మగడ్డకు ఎందుకు భయపడుతోందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

సాదాసీదాగా పోరు ప్రారఁభించిన నిమ్మగడ్డ
గతేడాది ఫిబ్రవరిలో ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు ప్రారంభమయ్యే నాటికి నిమ్మగడ్డ రమేష్ అనే పేరు ప్రభుత్వంలో ఉన్న చాలా మందికి తెలియదు. మరో ఏడాది పదవీకాలం ఉన్న నిమ్మగడ్డ రమేష్ స్ధానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి ఆయనపై ఎలాంటి వివాదాలు కూడా లేవు. సాదాసీదాగా ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ రమేష్ ఇచ్చిన నోటిఫికేషన్ను ప్రభుత్వం కూడా అంగీకరించింది.
కానీ అనతికాలంలోనే పరిస్ధితి మారిపోయింది. దీనికి ప్రధాన కారణం స్ధానిక ఎన్నికల్లో నిమ్మగడ్డ నిక్కచ్చిగా వ్యవహరించడమే. ముఖ్యంగా అధికార వైసీపీకి అనుకూలంగా ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించడమే. అయితే అప్పటికే ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండటంతో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్ధితి.

నిమ్మగడ్డ విషయంలో సర్కార్ అంచనా తప్పిన వేళ
నిమ్మగడ్డ రమేష్ హయాంలో స్ధానిక ఎన్నికలు సజావుగా జరిగిపోతాయని భావించిన వైసీపీ ప్రభుత్వానికి ఏకగ్రీవాలను అడ్డుకోవడం ద్వారా నిమ్మగడ్డ తొలి షాక్ ఇచ్చారు. అయినా పలుచోట్ల అధికారుల సాయంతో ఏకగ్రీవాలు నిరాటంకంగా జరిగిపోయాయి. వీటిపై ఆయన చర్యలు తీసుకునే లోపే కరోనా ప్రభావం మొదలు కావడంతో ఎన్నికలు వాయిదా వేశారు. ఇది ప్రభుత్వానికి మంటపుట్టించింది. తమ అంచనాలకు భిన్నంగా ఏకగ్రీవాలను అడ్డుకోవడమే కాకుండా ఎన్నికలు వాయిదా వేస్తారా అంటూ జగన్ సర్కారు భగ్గుమంది. అప్పటి నుంచి నిమ్మగడ్డతో వ్యవహారం ఉప్పూ నిప్పుగా మారిపోయింది.

జగన్ సర్కారుకు ఎన్నికల భయం అందుకేనా
నిమ్మగడ్డ హయాంలో స్ధానిక ఎన్నికలు ఇక ఎప్పుడు జరిగినా ఏకగ్రీవాలకు అవకాశం ఉండదు. ఎన్నికల వాయిదా నేపథ్యంలో ఆయనను కులం పేరుతో ఏకంగా సీఎం జగనే టార్గెట్ చేయడంతో ఆయన ప్రతీకార చర్యలకు దిగుతారా అన్న భయాలు ఓవైపు, ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుకుంటే ప్రభుత్వం పరువు పోతుందని మరోవైపు భయాలు సర్కారును వెంటాడాయి. దీంతో నిమ్మగడ్డ హయాంలో ఎన్నికలు జరగకుండా చూసుకుంటే సరిపోతుందని భావించారు. కానీ ఆయన పదవీకాలం ఈ ఏడాది మార్చి 31వరకూ ఉంది. మరోవైపు కరోనా ప్రభావం తగ్గిపోయింది. బీహార్ అసెంబ్లీతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరిగిపోయాయి. దీంతో వ్యాక్సినేషన్ పేరుతో ఎన్నికల వాయిదా కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
Recommended Video

ఓసారి ఎన్నికలు మొదలైతే అంతేనా..
వాస్తవానికి నిమ్మగడ్డ రమేష్ పదవీకాలం పూర్తయ్యేందుకు రెండు నెలలకు పైగా మాత్రమే ఉంది. ఆయన ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం చూసినా ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు పూర్తవుతాయి. అనంతరం మిగిలిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలన్నా మరో రెండు నెలల సమయం తప్పదు. ఆలోగే నిమ్మగడ్డ రిటైర్ అయిపోతారు. కానీ అక్కడే ఓ మెలిక ఉంది. ఓసారి స్ధానిక ఎన్నికల పోరు ప్రారంభిస్తే అందులో అన్ని ఎన్నికలు ముగిసేలోపు తనకు కొనసాగింపు ఇవ్వాలని నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించవచ్చు. అప్పుడు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇస్తే సర్కారుకు ఇబ్బందులు తప్పవు. అందుకనే స్ధానిక పోరులో ఏ ఒక్క ఎన్నిక కూడా జరగకుండానే నిమ్మగడ్డ రిటైర్ కావాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications