తల్లి ఓటమి తర్వాతే: స్వరూపానందేంద్రతో జగన్ లింకేమిటి?
విశాఖపట్నం: విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్రతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి బలమైన కారణమే ఉందని అంటున్నారు. జగన్ గురవారనాడు విశాఖలోని పెందుర్తి మండలం చినముషిడివాడలో గల శ్రీ శారదాపీఠంలో జరుగుతున్న మహా కుంభాభిషేకానికి హాజరయ్యారు.
పవిత్ర స్నానం చేసిన తర్వాత ఆయన పట్టువస్త్రాలు ధరించి కుంభాభేషికంలో పాల్గొన్నారు. వైయస్ జగన్కు స్వరూపానందేంద్ర స్వాగతం పలికారు. నిరుడు జనవరి 27వ తేదీన శారదాపీఠం వార్షికోత్సవాల్లో కూడా జగన్ పాల్గొన్నారు. అప్పటి నుంచి ఇరవురి మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని అంటుిన్నారు.

శారదాపీఠాధిపతి స్వరూపనందేంద్రతో కలిసి జగన్ పూజలు నిర్వహించారు. కలశానికి అభిషేకం చేసేందుకు కృత్తిమంగా ఏర్పాటు చేసిన చెక్కలపై ఎక్కుతూ జగన్ పైకి వెళ్లారు. అనంతరం ఆశ్రమంలోని ఆలయంలో పూజలు నిర్వహించారు. జగన్తో పాటు ఎంపీ సుబ్బరామిరెడ్డి కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజ అనంతరం సుబ్బరామిరెడ్డి, జగన్ కలిసే బయటకు వచ్చారు.
సాధారణ ఎన్నికల తర్వాతనే స్వరూపనందేంద్ర, జగన్ మధ్య సంబంధాలు బాగా మెరుగుపడ్డాయని అంటున్నారు. వైఎస్ విజయమ్మ విశాఖ ఎంపీగా పోటీ చేసిన సమయంలో ప్రత్యర్థులు ఓటర్లను మతం సెంటిమెంట్తో రెచ్చగొట్టారనే భావన బలంగా ఉంది.

ఆ సమయంలో స్వరూపనందేంద్ర కూడా బిజెపి అభ్యర్థి హరిబాబు గెలుపు కోసం పనిచేశారని అంటారు. అయితే ఎన్నికల తర్వాత ఒకసారి జగన్ నేరుగా శారదాపీఠానికి వెళ్లారు. అప్పటి నుంచి స్వరూపనందేంద్ర, జగన్ మధ్య సంబంధాలు బలపడ్డాయి. ఈ స్థితిలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే జగన్ స్వరూపానందేంద్రతో సంబంధాలను మెరుగుపరుచుకున్నట్లు చెబుతున్నారు.

తన విశాఖ పర్యటనలో భాగంగా వైయస్ జగన్ గురువారం ఉదయం ఐఎన్టియూసి నేత మంత్రి రాజశేఖర్ కూతురు దంపతులను ఆశీర్వదించారు. వధూవరులు మౌనిక, శివకల్యాణ్లను ఆశీర్వదించి, కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు.












Click it and Unblock the Notifications