చిరు పార్టీ ఏమైంది, కల్యాణం కోసమా: పవన్పై వెంకయ్య
నెల్లూరు: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి గత ఎన్నికల సమయంలో పెట్టిన ప్రజారాజ్యం ఏమయిందో అందరికీ తెలుసునని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు పార్టీలు పెడతారనే వార్తల నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. పవన్ కల్యాణ్ లోక కల్యాణం కోసం పార్టీ పెడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా అన్నారు.

తాము అధికారంలోకి వస్తే సీమాంధ్రకు పదేళ్ల పాటు స్వయంప్రతిపత్తిని కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెసు పార్టీ సీమాంధ్రకు అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. విడిపోయిన రాష్ట్రాన్ని అతికిస్తానని కొత్త పార్టీ చెప్పడం విడ్డూరమని కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. పాతాల భైరవి సినిమాలో మంత్రదండం వేసినట్లుగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. సీమాంధ్రను తాము స్వర్ణాంద్ర చేస్తామన్నారు.
నెల్లూరులో నేడు జరిగిన మోడీ ఫర్ పిఎం సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కిరణ్ పార్టీ ఎందుకు పెడుతున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రకటించిన ఐదేళ్ళ ప్రతిపత్తిని తాము పొడిగిస్తామని వెంకయ్య హామీ ఇచ్చారు. చిన్న రాష్ట్రాల అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందన్నారు. సీమాంధ్రకు ప్యాకేజీ కింద రూ.50 వేల కోట్లు ఇస్తామని జైరాం రమేశ్ చెప్పడం బూటకమని వెంకయ్య కొట్టిపారేశారు. ఆ నిధులు ఎక్కడి నుండి తెస్తారో చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications