మొన్న చిరంజీవి, నిన్న పవన్ కళ్యాణ్: జగన్పై ఆగ్రహం ఎందుకు!?
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మెగా సోదరులు.. పవన్ కళ్యాణ్, చిరంజీవిలు రాజకీయంగా బద్ద వ్యతిరేకులుగా ఉన్నట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అందుకు, 2014 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి - బిజెపి కూటమికి మద్దతివ్వడం, ఆ తర్వాత ఇటీవలే మంత్రి గంటా శ్రీనివాస రావు మెగాస్టార్ చిరంజీవితో తన అనుబంధాన్ని ఓ టీవీ ఛానల్తో పంచుకున్నారు. ఆ సమయంలోని చిరంజీవి చెప్పారని గంటా కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ బిజెపి - టిడిపికి మద్దతు పలకడం, చిరంజీవి చేసినట్లుగా గంటా చెప్పిన వ్యాఖ్యలను చూస్తుంటే మెగా సోదరులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా వ్యతిరేకిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. ఆయన పార్టీ నేరుగా ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల్లో టిడిపి - బిజెపి కూటమికి మాత్రం పవన్ మద్దతిచ్చారు. ఆ పార్టీల తరఫున పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు.
చిరంజీవి విషయానికి వస్తే.. ఆయన గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లుగా గంటా వెల్లడించారు. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలోకి వెళ్లే ముందు చిరును కలిశానని, తాను టిడిపిలోకి వెళ్తున్నానని చెబితే... 'చంద్రబాబు దగ్గరకే వెళ్తున్నావ్ కదా, జగన్ వద్దకు కాదు కదా అన్నారు' అని గంటా చెప్పారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో విభజన నేపథ్యంలో.. ఏపీకి అనుభవజ్ఞుడైన నాయకుడు, కేంద్రం సహకారం కావాలనే ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ టిడిపి - బిజెపి కూటమికి మద్దతిచ్చారని చెబుతారు. అయితే, ఎన్నికలకు ముందు.. కాంగ్రెస్, వైసిపి, టిడిపిలు పోటాపోటీగా ఉన్న సమయంలో చిరంజీవి అలా ఎందుకు చెప్పారనే చర్చ సాగుతోంది.