నరసన్నపేటపై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫోకస్ అందుకే.. చంద్రబాబుకు అర్ధమవుతోందా?
ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు.. ఎర్రన్నాయుడు తనయుడిగా రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా పార్లమెంటులో తమ గళాన్ని వినిపిస్తున్న యువనేత. ఈసారి ఈ యువనేత నరసన్నపేటలో ఆపరేషన్ వైసిపి అంటున్నారు. నరసన్నపేటపై ఫోకస్ పెట్టిన ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఇదే విషయం అధిష్టానానికి అర్థమయ్యేలా అనేక కార్యక్రమాలను నరసన్నపేటలో నిర్వహిస్తున్నారు.
టెక్కలి స్థానం నుండి ఓ పక్కన బాబాయ్ అచ్చెన్నాయుడు పోటీ చేస్తారు. ఇక నరసన్నపేట నుండి కింజారపు మోహన్ నాయుడు పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే అధిష్టానం ఒకే కుటుంబంలో ఇద్దరికి ఎమ్మెల్యే అభ్యర్థులుగా టికెట్ ఇస్తుందా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. రామ్మోహన్ నాయుడు ఎంపీగా పోటీ చేయకపోతే ఆ స్థానంలో బలమైన ఎంపీ అభ్యర్థి ఎవరు అన్నది కూడా ప్రస్తుతం టిడిపికి పెద్ద ప్రశ్నే.

అయితే పార్టీ అధిష్టానం ఏమి ఆలోచిస్తుంది అన్నది పక్కన పెడితే, రామ్మోహన్ నాయుడు మాత్రం నరసన్నపేట పైన బోలెడు ఆశలు పెట్టుకున్నారు. తన ఆలోచన అధిష్టానానికి తెలిసేలా వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి దృష్టి సారించారు.గత ఎన్నికలలో నరసన్నపేట నుండి ధర్మాన కృష్ణదాస్ గెలిచారు. సీఎం జగన్ ఆయనకు ఉపముఖ్యమంత్రిగా మూడేళ్ల కాలం పాటు అవకాశం కూడా ఇచ్చారు.
అంతకుముందు మూడు సార్లు జరిగిన ఎన్నికలలో కూడా ధర్మాన కృష్ణదాస్ గెలిచారు. ధర్మాన కృష్ణదాస్ కు నరసన్నపేట పై మంచి పట్టుంది. ఇక ధర్మానకు కంచుకోటగా ఉన్న నరసన్నపేట నుంచి పోటీ చేయాలని రామ్మోహన్ నాయుడు ప్రయత్నించడం కూడా ఒక రకంగా సాహసమనే చెప్పాలి.
ఎంపీగా రాష్ట్ర రాజకీయాలపై పెద్ద ఫోకస్ చేయలేకపోతున్న రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా రాష్ట్ర రాజకీయాలపై బలంగా ఫోకస్ చేయాలని భావిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన నరసన్నపేట నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. మరి చంద్రబాబు రామ్మోహన్ నాయుడుకి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగడానికి అవకాశం ఇస్తారా? లేక మళ్లీ ఎంపీగానే పోటీ చేసేలా ఆయనను అనునయిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications