నమ్మకాన్ని కోల్పోయిన చంద్రబాబు, కేసీఆర్
అమరావతి: వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ- దీని దూకుడును నిలువరించడానికి యూపీఏ సమాయాత్తమౌతోన్నాయి. ఎన్డీఏను ఉమ్మడిగా ఎదుర్కొనడానికి దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమౌతోన్నాయి.
ఇవ్వాళ బెంగళూరులో మలివిడత సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఇదివరకు బిహార్ రాజధాని పాట్నాలో తొలి విడతలో భేటీ ముగిసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ సమాజ్వాది పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, జనతా దళ్ (యునైటెడ్), నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, సీపీఐ, సీపీఎం పార్టీలు హాజరవుతున్నాయి.

శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), జార్ఖండ్ ముక్తి మోర్చా, ఎండీఎంకే, వీసీకే, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, కొంగుదేశ మక్కల్ కచ్చి, ఫార్వర్డ్ బ్లాక్, ఇండియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కాంగ్రెస్ (మణి), అప్నాదళ్ (కామెరవాడి), ఎంఎంకే పార్టీల నాయకులు ఈ భేటీలో పాల్గొననున్నారు. ఇంకాస్సేపట్లో ఈ సమావేశం ఆరంభం కాబోతోంది.
బిహార్లో జరిగిన భేటీతో పోల్చుకుంటే ఈ దఫా ప్రతిపక్ష పార్టీల బలం పెరిగింది. ఇదివరకు ఈ భేటీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పుడు తన సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. స్వయంగా బెంగళూరుకు రానున్నారు. ప్రతిపక్షాల సమావేశానికి హాజరు కానున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఏ పార్టీకీ ఆహ్వానం అందకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశ రాజకీయాల్లో తటస్థ వైఖరిని అనుసరిస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బిజూ జనతాదళ్.. దీనికి దూరంగా ఉన్నాయి. కేంద్రంపై యుద్ధం ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితికి కూడా ఆహ్వానం అందలేదు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీని దూరం పెట్టాయి.

బీజేపీతో జట్టు కట్టడానికి చంద్రబాబు ఆరాటపడుతుండటమే దీనికి కారణం అనేది బహిరంగ రహస్యం. గతంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటూ.. కేంద్రంలో మంత్రిపదవులను సైతం అనుభవించిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. పోలవరం ప్రాజెక్టు లెక్కలు అడిగారనే కారణంతో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికొచ్చిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఆ తరువాత చంద్రబాబు కాంగ్రెస్కు బేషరతుగా, బాహటంగా మద్దతు ప్రకటించారు. కోల్కతలో ప్రతిపక్ష పార్టీల ర్యాలీకి చంద్రబాబు హాజరయ్యారు. అప్పటి ప్రతిపక్ష భాగస్వామి జనతాదళ్ (సెక్యులర్) అధినేత కుమారస్వామి ప్రమాణ స్వీకారంలోనూ పాల్గొన్నారు. 2019 ఎన్నికల తరువాత చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు.
ప్రతిపక్ష పార్టీలు గెలవకపోవడంతో ఆయన మళ్లీ బీజేపీకి చేరువ కావడానికి ప్రయత్నాలు సాగిస్తోన్నారు. ప్రధాని మోదీపై యుద్ధాన్ని ప్రకటించిన కేసీఆర్కు ప్రతిపక్ష పార్టీల నుంచి ఆహ్వానం అందకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో సోనియా గాంధీని ఈడీ అధికారులు దర్యాప్తు చేసినప్పుడు కాంగ్రెస్కు మద్దతుగా నిలిచింది బీఆర్ఎస్. ఇప్పుడా పరిస్థితి లేదు.
ప్రతిపక్షాల భేటీకి బీఆర్ఎస్ను కూడా దూరం పెట్టారు. ముందు నుంచీ తటస్థంగా ఉంటూ వస్తోన్న జగన్ను పక్కనపెడితే- గతంలో ప్రతిపక్షాలతో చేతులు కలిపిన చంద్రబాబు, కేసీఆర్ను ప్రతిపక్షాలు ఆహ్వానించకపోవడం చర్చనీయాంశమైంది. విశ్వసనీయతను కోల్పోవడం వల్లే ప్రతిపక్షాలు దూరంగా పెట్టాయనే అభిప్రాయాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications