పవన్ కళ్యాణ్ మౌనం, చంద్రబాబు రివర్స్ గేర్: దారిలేకనా, నమ్మకమా?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజధాని భూసమీకరణ అంశంపై మరోసారి ట్విట్టర్ ద్వారా స్పందించారు. భూసమీకరణ పైన స్పందిస్తున్న జనసేన చీఫ్... ప్రత్యేక హోదా విషయంలో మాత్రం అంతగా స్పందించక పోవడం చర్చనీయాంశమవుతోంది.
ప్రత్యేక హోదా లేదా బలవంతపు భూసేకరణ.. రెండూ ప్రజల సమస్యలే. అయితే, భూసమీకరణ పైన స్పందిస్తున్న పవన్ కళ్యాణ్.. ప్రత్యేక హోదా విషయంలో అంతగా ఎందుకు మాట్లాడటం లేదనే చర్చ సాగుతోంది.
భూసమీకరణ పైన గతంలో ట్విట్టర్ ద్వారా స్పందించిన పవన్... రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి ఆ అంశం గురించి పెదవి విప్పారు. దానికి మంత్రి నారాయణ కూడా శుక్రవారం స్పందించారు. తాము పవన్ చెప్పినట్లుగా రైతులను ఒప్పించే భూమిని తీసుకుంటామని చెప్పారు.
ప్రత్యేక హోదాపై...

ప్రత్యేక హోదా విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ అంతగా పెదవి విప్పలేదు. ఒకటి రెండుసార్లు మాట్లాడినా.. నామమాత్రంగానే అంటున్నారు. ఏపీ ప్రజలు బిజెపి - టిడిపిని నమ్మి ఓట్లు వేశారని, ప్రత్యేక హోదా బాధ్యత ప్రధాని మోడీ పైన, బిజెపి పైన ఉందని ఆయన గతంలో అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో టిడిపి ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ పైన భగ్గుమన్నారు. ప్రత్యేక హోదా పైన పార్లమెంటులో మాట్లాడకుండా టిడిపి ఎంపీలు గోడలు చూస్తున్నారా అని తీవ్రంగా స్పందించారు. కానీ బిజెపి పైన మాత్రం అంత ఘాటుగా విరుచుకుపడలేదు.
ఇటీవల మునికోటి ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా కూడా ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తనను తాను ప్రత్యేక హోదా గురించి మాట్లాడే విషయమై నియంత్రించుకుంటున్నానని చెప్పారు.
కేంద్రం చెప్పినా...
ఇటీవల కేంద్రమంత్రులు, బిజెపి నేతల వ్యాఖ్యలు ప్రత్యేక హోదా పైన భిన్నంగా ఉన్నాయి. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ పెదవి విప్పకపోవడాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వనని కేంద్రం చెబుతున్నప్పటికీ పవన్ ఎందుకు మాట్లాడటం లేదని వైసిపి, కాంగ్రెస్ పార్టీలు నిలదీస్తున్నాయి.

ఇందుకు పవన్ కళ్యాణ్కు మోడీ ప్రభుత్వం పైన నమ్మకం ఉండటమా? అనే చర్చ సాగుతోంది. అంతేకాదు, రాజధాని భూములపై ఘాటుగా స్పందించి, ప్రత్యేక హోదా గురించి కూడా టిడిపి ఎంపీలపై మండిపడ్డ పవన్.. బిజెపి పైన అంతస్థాయిలో ఎందుకు మాట్లాడటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
టిడిపి వర్సెస్ బిజెపిలో.. పవన్ కళ్యాణ్ ఎటు?
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో... బిజెపికి మద్దతు, టిడిపికి వ్యతిరేకత అంతోఇంతో కనిపిస్తోందనే వారు లేకపోలేదు. ప్రత్యేక హోదా విషయమై కొద్ది రోజుల క్రితం ఏపీ టిడిపి - బిజెపి నేతల మధ్య అడపాదడపా వాగ్యుద్ధం జరిగింది. ఇది ఆ రెండు పార్టీల మైత్రికి తొలి అడుగుగా అప్పుడు అందరు భావించారు. ఇందులో పవన్.. బిజెపి వైపే ఉంటారని భావిస్తున్నారు.
సన్నిహితంగానే: బిజెపి దూరం వెళ్లినా.. దగ్గరకు చంద్రబాబు
2019 నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో బలమైన పార్టీగా ఎదగాలని బిజెపి భావిస్తోంది. తెలంగాణలో విపక్షంలో ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఏపీలో మిత్రపక్షం టిడిపికి నష్టం చేయకుండా బిజెపి ఎదగాలని భావిస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
అయితే, బిజెపి ఎదుగుదల టిడిపికి నష్టాన్ని తెస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. 2019 నాటికి బిజెపి ఎంత ఎదిగితే అన్ని సీట్లు ఎక్కువగా ఆ పార్టీకి ఇవ్వవలసి రావొచ్చు. మరోవైపు విభజన సమస్యలు. దీంతో ఏపీలోను పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా బిజెపి దృష్టి సారించింది.
అయితే, కొత్త రాష్ట్రం, ఆర్థిక కష్టాలు, రాజధాని నిర్మాణం, ఇచ్చిన హామీలు... వీటన్నింటి నేపథ్యంలో ఒకింత ఇబ్బంది అయినా కేంద్రంతో సన్నిహితంగా ఉంటూనే ఏపీకి అన్ని సాధించాలని చంద్రబాబు భావిస్తున్నారని చెబుతున్నారు.
ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడితో తమకే ఇబ్బంది అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అంతేకాకుండా, ప్రత్యేక హోదా కంటే ఎక్కువే సాయం చేస్తామని కేంద్రం చెబుతోంది.
ప్రత్యేక హోదా పైన విపక్షాలు ఇటీవల ఏపీలో ఉద్యమాన్ని తీవ్రం చేశాయి. ఆ సమయంలో చంద్రబాబు కేంద్రం నేతలతో ఒకింత ఘాటుగా మాట్లాడినట్లు వార్తలొచ్చాయి. అయితే, ఆ తర్వాత ఆయన తగ్గినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. కేంద్రంతో వైరం వల్ల తమకే నష్టమని ఆయన అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది.
విపక్షాలు మాత్రం ఓటుకు నోటు తదితర కేసుల్లో ఇరుక్కుపోయిన చంద్రబాబు కేంద్రంతో గట్టిగా మాట్లాడే పరిస్థితి కనిపించడం లేదని దుమ్మెత్తిపోస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడక పోవడానికి.. మోడీ పైన నమ్మకం ఉండటమే కారణం కావొచ్చంటున్నారు. కచ్చితంగా అన్యాయం జరిగిందని తెలిస్తే ఆలస్యంగానైనా రోడ్డెక్కవచ్చునని భావిస్తున్నారు.
రాజధాని భూసమీకరణ విషయంలో వరుస ట్వీట్లు మాత్రం.. ఆయన వైఖరిని తెలియజేస్తున్నాయంటున్నారు. బిజెపికి అనుకూలంగా, టిడిపి పట్ల ఒకింత వ్యతిరేకంగానే ఆయన కనిపిస్తున్నారని చెబుతున్నారు. ఇక, చంద్రబాబు సన్నిహితంగా ఉండి సాధించుకుందామని, అలాగే పవన్ కళ్యాణ్ విమర్శల పట్ల కూడా ఆచితూచి స్పందించాలని చెప్పారంటున్నారు.












Click it and Unblock the Notifications